
Shashi tharoor: మిస్రీ పనితీరు అద్భుతం.. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? : శశిథరూర్
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: భారత్- పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం ఆయనపై సామాజిక
మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) స్పందించారు. ట్రోల్స్ను ఖండించిన ఆయన.. మిస్రీ దేశం కోసం అద్భుతంగా పనిచేశారని
కొనియాడారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సంఘర్షణ జరుగుతున్న సమయంలో విక్రమ్ మిస్రీ అద్భుతమైన పనితీరు కనబరిచారని నేను భావిస్తున్నా. ఆయన చాలా కష్టపడ్డారు.
భారత్ గొంతును బలంగా వినిపించారు. అలాంటి అధికారిని ఎవరు? ఎందుకు? ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిస్రీపై విమర్శలు చేస్తున్నవారు ఆయన కంటే భిన్నంగా, మెరుగ్గా చేయగలరా?’ అని
ప్రశ్నించారు. ఈసందర్భంగా భారత ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ, నేవీ వింగ్ కమాండర్-హెలికాప్టర్ పైలట్ వ్యోమికా సింగ్ల పనితీరును కూడా శశిథరూర్ అభినందించారు. * కాల్పుల మోత లేదు.. 19 రోజుల
తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత భారత్- పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు శనివారం కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడిన సంగతి తెలిసిందే. దీన్ని మిస్రీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
దీనికి ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్- పాక్లు అంగీకరించాయని ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిపై మిస్రీ విలేకరుల సమావేశంలో ఎలాంటి
ప్రకటన చేయలేదు. ఈక్రమంలోనే కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఆయన వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. దీన్ని ఇప్పటికే పలువురు రాజకీయ
నాయకులు, మాజీ దౌత్యవేత్తలు ఖండించారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న పౌర సేవకులపై వ్యక్తిగతంగా ఇలాంటి ట్రోల్స్ చేయడం విచారకరమని ఐఏఎస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. మిస్రీపై
వస్తున్న ట్రోల్స్నూ ఐఆర్టీఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించింది. ఆయన అంకితభావంతో దేశం కోసం గణనీయమైన కృషి చేశారని కొనియాడింది. ఈ ట్రోలింగ్స్ను ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ,
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా తీవ్రంగా ఖండించారు. మిస్రీ భారత్ కోసం అవిశ్రాంతంగా పని చేసే నిజాయితీ గల దౌత్యవేత్తని ఓవైసీ పేర్కొన్నారు. ఈ ట్రోలింగ్స్పై కేంద్ర ప్రభుత్వం
ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని అఖిలేశ్ యాదవ్ తప్పుబట్టారు. మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ మీనన్రావు కూడా మిస్రీపై వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడాన్ని ఖండించారు. దీన్ని సిగ్గుచేటు చర్యగా
పేర్కొన్న ఆయన.. ట్రోల్స్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.