
Water intake: నీరు సరిగ్గా తాగుతున్నారా.. వీటిని లెక్కలోకి తీసుకోవాలట..
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: నీరు మనకు ప్రాణాధారం. ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియలకు ఎంతో అవసరం. మన ఆరోగ్యం బాగుండాలంటే తగినంత నీరు తాగాల్సిందే. అయితే, రోజు మొత్తంలో ఎంత నీరు
తాగాలనే విషయంలో చాలామంది మదిలో ప్రశ్నలు మెదులుతుంటాయి. తక్కువ నీరు తాగడం అనారోగ్యానికి దారితీసినట్లే.. ఓవర్ హైడ్రేషన్ కూడా సమస్యాత్మకమే. ఈ నేపథ్యంలో నీరు తాగడం మోతాదులోనే ఉండాలంటున్నారు
వైద్య నిపుణులు. అమెరికాకు చెందిన ‘నేషనల్ అకాడమిక్స్’ సంస్థ ప్రకారం.. పురుషులకు రోజుకు సగటున 3.7 లీటర్లు, మహిళలకు 2.7 లీటర్ల నీరు అవసరం. ఆహారం, ఇతర పానీయాల నుంచి అందే నీటిశాతం ఇందులో భాగమే.
అయితే, ఈ లెక్కలు అన్నివేళలా, అందరికీ ఒకేలా వర్తించాలనేది లేదు. కొన్ని అంశాలు ఇందులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. అవేంటో పరిశీలిస్తే.. * శారీరక శ్రమ: ఎంత ఎక్కువ శారీరక శ్రమ చేస్తే.. శరీరం
నుంచి అదే రీతిలో చెమట రూపంలో నీళ్లు వెళ్లిపోతాయి. దీంతో దానికి తగినట్లు నీరు తీసుకోవాల్సి ఉంటుంది. * వాతావరణం: అధిక ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో ఎక్కువ చెమట పడుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే
డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. * ఆహార శైలి: ఉప్పు, ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే.. శరీరానికి మరింత నీటి అవసరం ఏర్పడుతుంది. * ఆరోగ్యం- ఔషధాలు: జ్వరం, డయేరియా,
మధుమేహం వంటి పరిస్థితుల్లో నీటి అవసరాలు పెరుగుతాయి. కొన్ని రకాల మందులు కూడా హైడ్రేషన్ స్థాయులను ప్రభావితం చేస్తాయి. * శరీరం- వయసు: పిల్లలు, పెద్దలు, గర్భిణులు, బాలింతలు, భారీ కాయం
కలిగినవారు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా నీటి అవసరాలు ఉంటాయి. * ఆల్కహాల్- కెఫిన్: వీటి కారణంగా డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో నీళ్లు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. మోతాదు
మించితే ముప్పే.. కొంతమంది మోతాదుకు మించి నీళ్లు తాగుతుంటారు. దీంతో కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది. మూత్రపిండాల వ్యాధులు వంటివి ఉన్నవారిలో సరైన మోతాదులో నీళ్లు, విషతుల్యాలు బయటికి
వెళ్లకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరడం, రక్తపోటులో హెచ్చుతగ్గులు వంటి అనారోగ్యాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రక్తంలో సోడియం
లెవల్స్ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్య (Hyponatremia) తీవ్రమైన పరిస్థితుల్లో వికారం, వాంతులు, మూర్ఛ వంటివాటితోపాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదమూ లేకపోలేదని
పేర్కొంటున్నారు. * కళ్ల మీద కంప్యూటర్ ఒత్తిడా? శరీరంలో నీటి స్థాయులు పెరిగాయన్న విషయం కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల బలహీనత, వికారం,
వాంతులు, నీరసం, అలసట, పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటివి కనిపిస్తాయంటున్నారు. వీటిలో కొన్ని లక్షణాలు శరీరంలో నీటి స్థాయులు తగ్గినప్పుడు కూడా బయటపడతాయట. అందుకే డాక్టర్ని సంప్రదించి,
వారి సలహాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. రోజూ నిర్ణీత మొత్తంలోనే నీళ్లు తాగాలనే నియమం పెట్టుకునే బదులు.. ఈ విషయంలో శరీరం ఇచ్చే కొన్ని సూచనలు లెక్కలోకి తీసుకోవాలట. దాహం, మూత్రం రంగు, జీర్ణక్రియ
వంటివి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు తాగేయకుండా.. తరచూ కొద్దికొద్దిగా తాగడమే ఉత్తమం.