
Congress: దేశవ్యాప్తంగా ‘జైహింద్ ర్యాలీ’లకు కాంగ్రెస్ నిర్ణయం
Play all audios:

దిల్లీ: ఆపరేషన్ సిందూర్ను భాజపా రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ (Congress) ఆరోపించింది. భారత్- పాక్ కాల్పుల విరమణ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump)
వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మౌనాన్ని ప్రశ్నిస్తూ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది. రాబోయే రోజుల్లో ‘జైహింద్’ పేరిట ఈ ర్యాలీలు జరుగుతాయని
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్పై రాజకీయాలు చేయడం తగదన్నారు. సైనిక చర్య సాయుధ దళాలు, దేశానికి చెందినది అయినప్పటికీ.. భాజపా దీన్ని తమ బ్రాండ్గా
మార్చుకొనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని రాలేదు? దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ వివిధ రాష్ట్రాల్లో జైహింద్ ర్యాలీలు నిర్వహిస్తామని జైరాం రమేశ్ అన్నారు.
రాహుల్ గాంధీ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడతారని తెలిపారు. బుధవారం సాయంత్రం దిల్లీలోని అక్బర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం
రమేశ్, ప్రియాంకా గాంధీ వాద్రా, సచిన్ పైలట్తో పాటు పలువురు నేతలు సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేత పవన్ ఖేడాతో కలిసి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. ‘‘పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఖర్గే,
రాహుల్ ఐక్యత గురించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ను స్వాగతించారు. సాయుధ దళాలు, కేంద్రం వెన్నంటే ఉంటామని ప్రకటించారు. పాక్పై చర్యలకు మద్దతు
ఇచ్చారు. మేం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే.. రెండు సార్లు భేటీలు జరిగితే ప్రధాని మాత్రం హాజరు కాలేదు. కేవలం లాంఛనప్రాయంగానే ముగిశాయి’’ అన్నారు. విపక్ష రాష్ట్రాల సీఎంలు
చేసిన తప్పేంటీ? ‘‘కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి పహల్గాం ఉగ్రదాడి గురించి చర్చించాలని ప్రధానికి లేఖ రాశారు. ఈ నెల 25న
ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు సమాచారం ఉంది. ఈ సమావేశానికి విపక్ష రాష్ట్రాల సీఎంలను ఎందుకు ఆహ్వానించలేదు.. వారు చేసిన తప్పేంటి? అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ తీరుపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరపాలి’’ అని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.