
Operation sindoor: ఆపరేషన్ సిందూర్.. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టు దిగ్బంధం
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా పాక్ ప్రతిస్పందించే అవకాశాన్ని పసిగట్టిన నావికాదళం సముద్ర సంసిద్ధతను
గణనీయంగా పెంచడానికి పలు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా పాక్లోని కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant), బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను
మోహరించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వాటిని మోహరించడంతో ఆపరేషన్ సిందూర్ ఫలించిందని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ
అధికారులు పేర్కొన్నారు. కరాచీ పోర్ట్ను లక్ష్యంగా చేసుకొని 36 ఫ్రంట్లైన్ నావికా దళాలను మోహరించామని తెలిపారు. వీటిలో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఏడు డిస్ట్రాయర్లు, మీడియం-రేంజ్
సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు (MRSAM), వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలు ఉన్నాయన్నారు. వీటిలో కొత్తగా ప్రవేశపెట్టిన INS తుషిల్తో సహా ఏడు స్టెల్త్ గైడెడ్-క్షిపణి యుద్ధనౌకలను సైతం మోహరించినట్లు
వివరించారు. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టును దిగ్బంధించడం వల్ల వారి నావికాదళం సమర్థవంతంగా ప్రతిస్పందించలేకపోయిందని.. కేవలం నౌకాశ్రయానికే పరిమితమవ్వాల్సి వచ్చిందని
అధికారులు పేర్కొన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు తమ దారిని మళ్లించుకున్నాయి. * పాక్ వాయుసేన ఉక్కిరి బిక్కిరి.. ఐదోవంతు వసతులు ధ్వంసం పహల్గాం ఉగ్రదాడి తర్వాత
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. కాగా ఇందులో భారత క్షిపణులు పాకిస్థాన్ అణుస్థావరాలను తాకినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మే 9 అర్ధరాత్రి, 10వ
తేదీన పాకిస్థాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్లు తెలిపింది.
రావల్పిండిలోని పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్కు సమీపంలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్బేస్ పైనా ఇండియన్ ఆర్మీ ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసింది. దీంతో పాక్ అమెరికా సహాయంతో భారత్తో కాళ్ల
బేరానికి వచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్.. రూ.20వేల కోట్లతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ను 2022 సెప్టెంబర్లో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో ఐఎన్ఎస్
విక్రాంత్ భారత్లో నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక. మిగ్-29కే, హెలికాప్టర్లతో సహా 30 యుద్ధ విమానాలను ఇది మోసుకెళ్లగలదు. విక్రాంత్ డిజైన్ను భారత నౌకాదళంలోని వార్షిప్ డిజైన్ బ్యూరో
తయారుచేసింది. ఈ నౌక నిర్మాణాన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ పూర్తిచేసింది.