
Press briefing by dgmos: మా పోరాటం ఉగ్రవాదులపైనే.. పాక్ నష్టానికి బాధ్యత వారిదే: రక్షణశాఖ
Play all audios:

పాకిస్థాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలచుకున్నాయని భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’లో భాగంగా మే
7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరు అని ‘ఆపరేషన్ సిందూర్’పై నిర్వహించిన మీడియా సమావేశంలో
వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్పై దాడుల వీడియోలను అధికారులు ప్రదర్శించారు. పాకిస్థాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలచుకున్నాయని పేర్కొన్నారు. దీంతో
భారత సైన్యం దీటుగా జవాబు ఇచ్చిందని చెప్పారు. పాకిస్థాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. పాకిస్థాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు
శత్రుదుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదన్నారు. అనంతరం పాక్లోని నూర్ఖాన్, రహీమ్యార్ఖాన్ ఎయిర్బేస్లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు. పీవోకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్
విజయవంతం: ఏకే భారతి ‘‘పాకిస్థాన్, పీవోకేలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాం. పీవోకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా మనం యుద్ధం చేశాం. అత్యాధునిక
క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టాం. మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ను ఈ ఆపరేషన్లో సమర్థంగా
వినియోగించాం. పాకిస్థాన్కు చెందిన సామాన్య పౌరులకూ ఎలాంటి నష్టం చేయలేదు. అదే సమయంలో పాకిస్థాన్ వైపు నుంచి దాడులను సమర్థంగా తిప్పికొట్టాం. చైనా తయారు చేసిన పీఎల్-15 క్షిపణిని నేలకూల్చాం.
పాకిస్థాన్కు చెందిన అనేక డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చివేశాం. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టాం. కరాచీ సమీపంలోని లక్ష్యాలపైనా దాడులు చేశాం’’ అని ఎయిర్ మార్షల్
ఏకే భారతి వెల్లడించారు. పటిష్ఠ నిఘాతో దాడులను తిప్పికొట్టాం.. వైస్ అడ్మిరల్ ప్రమోద్ భారత్ వైపు గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు.
ఎయిర్క్రాఫ్ట్ కేరియర్లు, రాడార్లు ఉపయోగించామన్నారు. ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్ను సమర్థంగా వినియోగించామని చెప్పారు. డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను వినియోగించినట్లు వెల్లడించారు. నౌకాదళ
అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్లు పేర్కొన్నారు. ‘‘వందల కి.మీ దూరంలో ఉన్న శత్రుసేనల విమానాలను దగ్గరకు రాకుండా అడ్డుకున్నాం. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. మన
స్వదేశీ ప్రతిస్పందన దాడి వ్యవస్థ చాలా బలమైంది. సైన్యానికి అండగా నిలిచిన 140 కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది’’ అని వైస్ అడ్మిరల్
ప్రమోద్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా ఉగ్రవాదం తీరులో మార్పు వచ్చిందని.. ఉగ్రవాదులు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆర్మీ డీజీఎంవో రాజీవ్ ఘాయ్ అన్నారు.