Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో హతమైన టాప్‌ టెర్రరిస్ట్‌లు వీళ్లే.. వివరాలు వెల్లడి..

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో హతమైన టాప్‌ టెర్రరిస్ట్‌లు వీళ్లే.. వివరాలు వెల్లడి..

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ గట్టిగా బదులు తీర్చుకుంది. లష్కరే తయ్యిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. మే 7వ తేదీన అర్ధరాత్రి దాటిన


తర్వాత పాక్‌, పీఓకేలో జరిపిన మెరుపు దాడుల్లో తొమ్మిది కీలక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇటీవల కేంద్రం


వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు కీలక ఉగ్ర నాయకులను కూడా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. వారి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. జైషే మహమ్మద్‌ వ్యవస్థాపకుడు మసూద్‌ అజార్‌ ఇద్దరు


బావమరుదులతో పాటు లష్కరే తయ్యిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లుగా పేర్కొంటూ ఆంగ్ల మీడియాలో ఓ జాబితా


బయటికొచ్చింది. 1. ముదస్సర్‌ ఖదాయిన్‌ ఖాస్‌ అలియాస్‌ అబు జుండాల్‌ ఇతడు లష్కరే తయ్యిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది. ఇతడి అంత్యక్రియలను పాక్‌ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించినట్లు తెలుస్తోంది.


అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ అబ్దుల్‌ రౌఫ్‌ నేతృత్వంలోని జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్‌, పంజాబ్ (పాక్‌లోని) సీఎం, ఐజీ పాల్గొన్నట్లు సమాచారం. * పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా


కదులుతోంది: భారత్‌ 2. హఫీజ్‌ మహమ్మద్‌ జమీల్‌ జైషే మహమ్మద్‌ ఉగ్ర ముఠాలోని కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజార్‌కు పెద్ద బావమరిది. 3. మహమ్మద్‌ యూసఫ్‌ అజార్‌ అలియాస్‌ ఉస్తాద్‌ జీ


అలియాస్‌ సలీమ్‌ అలియాస్‌ సాహబ్‌ జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది ఇతడు. మసూద్‌ అజార్‌ మరో బావమరిది అయిన అజార్‌.. ఐసీ-814 విమాన హైజాక్‌ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 4. ఖలీద్‌ అలియాస్‌


అబు అకాస లష్కరే తయ్యిబాకు చెందిన టాప్‌ ఉగ్రవాది. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌ చేసేవాడు. ఫైసలాబాద్‌లో జరిగిన ఇతడి అంత్యక్రియలకు


పాక్‌లోని సీనియర్‌ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్‌ హాజరైనట్లు సమాచారం. 5. మహమ్మద్‌ హసన్‌ ఖాన్‌ జైషే మహమ్మద్‌ ముఠాలో కీలక సభ్యుడు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఆపరేషనల్‌ కమాండర్


ముఫ్తి అస్గర్‌ ఖాన్‌ కశ్మీరీ కుమారుడు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు. జైషే, లష్కరే ముఠాల కీలక స్థావరాలే లక్ష్యంగా భారత్‌ ఈ మెరుపుదాడులు చేపట్టిన సంగతి


తెలిసిందే. భారత్‌ టార్గెట్‌ చేసిన వాటిల్లో.. లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో గల లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉంది. ఇక్కడ 26/11 ముంబయి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్‌,


డేవిడ్‌ హెడ్లీ శిక్షణ తీసుకున్నారు. ఇక, జైషేకు చెందిన ప్రధాన కేంద్రం బహవల్‌పూర్‌లోని మర్కజ్‌ సుబాన్‌పైనా దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్‌ అజార్‌ కుటుంబంలోని 10 మంది మృతిచెందినట్లు వార్తలు


వచ్చాయి.