
Rajnath singh: బ్రహ్మోస్ శక్తి గురించి తెలియకపోతే పాక్ను అడగండి: యోగి ఆదిత్యనాథ్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఆదివారం లఖ్నవూలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి
యూనిట్ను (BrahMos Aerospace) వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని వెల్లడించారు. ఆ
సమయంలో ఈ క్షిపణులకున్న శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. దీని ప్రభావం గురించి తెలియని వారెవరైనా ఉంటే.. పాకిస్థాన్ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఉగ్రవాదం అనేది కుక్కతోక లాంటిదని..
దానిని సరిచేయాలంటే వారి సొంత భాషలోనే బదులివ్వాలని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్లో ఏటా
80 నుంచి 100 క్షిపణులను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణులు 290 నుంచి 400 కి.మీ పరిధిని, మాక్ 2.8 రెట్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. నెక్ట్స్ జనరేషన్
బ్రహ్మోస్ క్షిపణులు లఖ్నవూలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ నుంచి ఏటా వంద 100 బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేయడమే కాకుండా.. అదనంగా ప్రతి ఏడు 100 నుంచి 150
నెక్ట్స్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణులను కూడా తయారు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు, సుఖోయ్ వంటి యుద్ధ విమానాలు ఒకే ఒక బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లగలవు. అయితే, అవి ఇప్పుడు
మూడు నెక్ట్స్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లగలవని తెలిపారు. ఈ క్షిపణి 300 కిలోమీటర్లకు పైగా రేంజ్ వరకు దాడి చేయగలదు. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి 2,900 కిలోగ్రాముల బరువు ఉండగా..
నూతన క్షిపణుల బరువు 1,290 కిలోగ్రాములు ఉంటుంది. 2018 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రారంభించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఈ యూనిట్ను
ప్రకటించారు. తయారీ యూనిట్తో పాటు, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ, టైటానియం, సూపర్ అలాయ్స్ మెటీరియల్స్ ప్లాంట్ (స్ట్రాటజిక్ మెటీరియల్స్ టెక్నాలజీ కాంప్లెక్స్)ని కూడా
రాజ్నాథ్ ప్రారంభించారు. ఇది ఏరోస్పేస్ రక్షణ తయారీలో ఉపయోగించే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని మిషన్ చంద్రయాన్ వంటి అంతరిక్ష కార్యక్రమాల్లో, ఫైటర్ జెట్లలో ఉపయోగిస్తారు. కార్యక్రమంలో
భాగంగా పలు ఆయుధ కేంద్రాల వ్యవస్థల (DTIS)కు కూడా కేంద్రమంత్రి పునాది రాయి వేశారు. రక్షణ ఉత్పత్తులను పరీక్షించడానికి, వాటి సామర్థ్యాన్ని ధ్రువీకరించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి. 2019లో
తమిళనాడులో దేశంలోనే మొదటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను స్థాపించారు. ఇతర దేశాల నుంచి రక్షణ దిగుమతులను తగ్గించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఉపాధిని సృష్టించడం వీటి ముఖ్య లక్ష్యం. భారత్,
రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను భూమి, గాలిలోనే కాకుండా సముద్రాలలోనూ ప్రయోగించవచ్చు. ఇవి భారతదేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.