
Operation sindoor: సరిహద్దుకు 100 కి. మీల లోనివే టార్గెట్.. భారత్ దాడి చేసిన 9 స్థావరాలివే..
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడులు జరిపింది. దీంతో దాయాది ఒక్కసారిగా
ఉలిక్కిపడింది. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు
ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్థాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహ్మద్కు చెందిన నాలుగు, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉన్నాయి.
రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి. దాడులు జరిపిన స్థావరాల వివరాలు ఇలా.. * బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్: ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్కు చెందిన
ప్రధాన కార్యాలయంగా పేర్కొంటారు. * మురిద్కేలోని మర్కాజ్ తోయిబా: సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడే 26/11 ముంబయి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు
తలదాచుకున్నారని సమాచారం. * సియల్కోట్లోని మెహ్మూనా జోయా: అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీ దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి. * కోట్లిలోని
మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం: నియంత్రణ రేఖకు 35 కి.మీ. దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి
ఉగ్రవాదులే కారణం అని సమాచారం. * కోట్లిలోని మస్కర్ రహీల్ షహీద్: పీఓకేలో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్లో నాలుగు గదులు, బరాక్లు ఉన్నాయి. వీటిలో
పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం. * ముజఫరాబాద్లోని షవాయ్ నల్లాహ్: పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే
క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడుతున్నారు. 2000 నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. * బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదిత్
ఉగ్ర స్థావరం: ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్. పూంఛ్-రాజౌరి-రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు, ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. * ముజఫరాబాద్లోని సైద్నా
బిలాల్ ఉగ్ర స్థావరం: పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజఫరాబాద్ రెడ్ఫోర్ట్కు ఎదురుగా ఉంటుంది. జమ్మూకశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్గా
నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ 50-100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం. * తెహ్రా కలాన్లోని సర్జల్: జైషే మహ్మద్ ఉగ్ర స్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూకశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు
ఉపయోగిస్తున్నారు. గత దాడుల తీరులోనే గతంలో పుల్వామా, ఉరి ఉగ్రఘటనలకు సంబంధించి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దఫా ఏకంగా పాకిస్థాన్ ఆయువు పట్టు పంజాబ్లో సైతం దాడులు
చేయడం గమనార్హం. 71 యుద్ధం అనంతరం భారత త్రివిధదళాలు సంయుక్తంగా సమన్వయంతో దాడులు నిర్వహించాయి. ఉగ్రవాదుల శిక్షణ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ
దాడులతో లష్కరే, జైషేకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.