
బ్రూనై భారత హైకమిషనర్కు ఘన వీడ్కోలు
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: బ్రూనై దారుస్సలాం భారత హైకమిషనర్గా వ్యవహరించిన అలోక్ అమితాబ్ దిమ్రీకి ఘన వీడ్కోలు లభించింది. ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో తెలుగు అసోసియేషన్, మరాఠా కమ్యూనిటీ
నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో బెలైట్ ఇండియన్ కమ్యూనిటీ హృదయపూర్వకంగా ఆయనకు వీడ్కోలు పలికింది. భారత్, బ్రూనై మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషిని ఈసందర్భంగా
ప్రశంసించింది. కౌలా బెలైట్లోని పనాగా క్లబ్లోని కెన్యాలాంగ్ కేఫ్లో మే 30న రాత్రి వీడ్కోలు సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి తొలుత కమ్యూనిటీ సభ్యులైన వైష్ణవే సూర్యదేవర
హృదయపూర్వక స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత బెలైట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన మరో యువ సభ్యులు నక్షత్ర బండరావూరి నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సాహభరితంగా సాగాయి. శాకమూరి వెంకటేశ్వర్లు రంగపుర విహార కర్ణాటక గాత్ర ప్రదర్శన, కావ్య అర్జున్ మరాఠే మనోహరమైన జిమ్నాస్టిక్స్ ప్రదర్శన, వైష్ణవే సూర్యదేవర చేసిన శాస్త్రీయ భరతనాట్యం
ఆకట్టుకున్నాయి. అనంతరం బెలైట్ కమ్యూనిటీ సభ్యులు కావ్య మరాఠే నేతృత్వంలో వీడ్కోలు సభ జరిగింది. నాయకులతో కలిసి హైకమిషనర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన సేవలను కొనియాడారు. తెలుగు అసోసియేషన్
అధ్యక్షుడు రమణరావు, మరాఠా కమ్యూనిటీ ప్రతినిధి అర్జున్ మరాఠే ప్రసంగించారు. హై కమిషనర్ అత్యుత్తమ సేవలకు కృతజ్ఞతగా ఒక స్మారక చిహ్నాన్ని అందజేశారు. ఈసందర్భంగా అలోక్ మాట్లాడుతూ.. తన పదవీకాలంలో
భారత సమాజం, బ్రూనై ప్రజలు చూపిన ఆప్యాయత, సహకారం మరువలేనివన్నారు. రెండు దేశాల మధ్య బలీయమైన సంబంధాలు ఉన్నాయన్నారు. సాయంత్రం విందుతో కార్యక్రమం ముగిసింది.