
Rohit sharma: అప్పుడు స్టేడియంలో నా పేరు చూసుకుంటే.. భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma)కు అరుదైన గౌరవం దక్కింది. వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్కు
రోహిత్ శర్మ పేరు పెట్టారు. ఆ స్టాండ్ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోహిత్ తల్లిదండ్రులు, సతీమణి రితిక హాజరయ్యారు. ఈ సందర్భంగా హిట్మ్యాన్ మాట్లాడుతూ భావోద్వేగానికి
గురయ్యాడు. ఆ స్టేడియంతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నాడు. భవిష్యత్లో వన్డే ఫార్మాట్లో టీమ్ఇండియా తరఫున వాంఖడే స్టేడియంలో ఆడాలనుందని రోహిత్ పేర్కొన్నాడు. ‘‘ఇక్కడికి విచ్చేసి ఈ
కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మలిచిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఇలా స్టాండ్కు నా పేరు పెడతారని నేనెప్పుడూ ఊహించలేదు. చిన్నప్పుడు ముంబయి తరఫున, టీమ్ఇండియా తరఫున ఆడాలని కోరుకున్నప్పుడు.. ఎప్పుడూ
వీటి గురించి ఆలోచించలేదు. ఏ ఆటగాడికైనా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని, దేశానికి సేవ చేయాలని ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లు సాధిస్తాం. అయితే.. వాటన్నింటి కంటే ఇది ఎంతో ప్రత్యేకం. వాంఖడే గొప్ప
స్టేడియం. దీనితో నాకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నేతల మధ్యలో నా పేరు ఉండటాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఇందుకు ముంబయి క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు. నేను రెండు
ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాను. ఇప్పటికీ ఇంకో ఫార్మాట్లో ఆడుతున్నాను. ఇక్కడికి 21న దిల్లీ క్యాపిటల్స్తో ముంబయి తరఫున ఆడేందుకు వస్తున్నాను. అప్పుడు నాకు ప్రత్యేక అనుభూతి దక్కుతుంది’’
‘‘ఇక్కడ ఏ జట్టుతోనైనా టీమ్ఇండియా తరఫున ఆడటం నాకు మరింత ప్రత్యేకంగా నిలవనుంది. ఈ గౌరవాన్ని నా కుటుంబసభ్యుల ముందు అందుకోవడం ఎంతో గొప్పగా ఉంది. నా జీవితంలోని ప్రతి ఒక్కరికీ.. వారు చేసిన
త్యాగాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని రోహిత్ పేర్కొన్నాడు. వాంఖడే స్టేడియంలో సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, వినూ మన్కడ్, దిలీప్ వెంగ్సర్కార్ల పేర్లతో స్టాండ్లు ఉన్నాయి.
ఇప్పుడు రోహిత్ శర్మ, శరద్పవార్, అజిత్ వాడేకర్ పేరిట స్టాండ్లను ఆవిష్కరించారు.