
India oil bill: దిగొచ్చిన చమురు ధరలు.. రూ. 1. 8 లక్షల కోట్లు ఆదా
Play all audios:

India Oil bill: అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరల కారణంగా భారత్కు రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. India Oil bill | దిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు
భారీగా ధరలు దిగొచ్చాయి. సుంకాలు, తద్వారా వృద్ధిపై ప్రభావం పడొచ్చన్న ఆందోళనల వేళ చమురు ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్లు ఒపెక్+ దేశాలు ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
ఇదే ట్రెండ్ కొనసాగితే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్కు లాభదాయకమని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. తద్వారా సుమారు రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా వేసింది.
భారత్ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల మీదే ఆధారపడుతోంది. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం 242.4 బిలియన్ డాలర్లను వెచ్చించింది. అదే సమయంలో లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్
(LNG) దిగుముతల కోసం 15.2 బిలియన్ డాలర్లను వెచ్చించింది. డిమాండ్ను మించి సప్లయ్ ఉండొచ్చన్న అంచనాలతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర నాలుగేళ్ల కనిష్ఠమైన 60.23 డాలర్లకు
చేరింది. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు లీటర్కు రూ.2 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించింది. అప్పటి క్రూడాయిల్ ధరతో పోలిస్తే ప్రస్తుత ధర 20 డాలర్లు తక్కువ. ప్రస్తుత
ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్- 2026 మార్చి) సగటున 60-70 డాలర్లు మధ్య ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. ఈ ధరల స్థాయి వద్ద క్రూడాయిల్పై రూ.1.8 లక్షల కోట్లు, ఎల్ఎన్జీ దిగుమతులపై రూ.6 వేల కోట్ల
మేర ఆదా అయ్యే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది. అటు చమురు రిటైల్ కంపెనీల మార్జిన్లూ మెరుగవుతాయని తెలిపింది.