
Stock market: భారీ లాభాల్లో సూచీలు.. 25 వేల పైకి నిఫ్టీ.. కారణాలు ఇవే
Play all audios:

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఉదయం నష్టాల్లో ట్రేడయిన సూచీలు.. మధ్యాహ్నం
తర్వాత ఒక్కసారిగా దూసుకెళ్లాయి. అమెరికా- భారత్ మధ్య ట్రేడ్ డీల్పై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పాజిటివ్ సెంటిమెంట్కు కారణమయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్,
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ వంటి స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ఆటో, మెటల్, ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ రాణించాయి. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు
స్వల్పంగా లాభపడ్డాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 82 వేలు దాటగా.. నిఫ్టీ 25వేల మార్కు అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 81,354.43 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు
81,330.56) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం వరకు స్వల్ప శ్రేణిలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. తర్వాత ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 82,718.14
పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 1200 పాయింట్ల లాభంతో 82,530.74 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 394 పాయింట్లు లాభంతో 25061 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.52గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్ మినహా అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా
లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 63 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3177 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కారణాలు ఇవే... * తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే చాలా
రకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్లను ఆఫర్ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ఇప్పటికే భారత్-అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వచ్చిన
ఈ ప్రకటన పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. * అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ జరగొచ్చన్న వార్తల కారణంగా క్రూడాయిల్ ధర బ్యారెల్కు 2 డాలర్ల మేర క్షీణించింది. ఇరాన్పై ఆంక్షలు తొలగితే
గ్లోబల్గా క్రూడ్ సప్లయ్ పెరుగుతుంది. * మన మార్కెట్పై విదేశీ సంస్థాగత మదుపర్ల విశ్వాసం కొనసాగుతోంది. గడిచిన 20 ట్రేడింగ్ సెషన్లలో 19 రోజులు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. రూ.50వేల
కోట్లు విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. * అమెరికా డాలర్ ఇండెక్స్ కాస్త బలహీన పడి 100.74కు చేరింది. ఫిబ్రవరిలో 109.88గా ఉంది. డాలర్ బలహీన పడితే భారత్ వంటి మార్కెట్లకు విదేశీ
పెట్టుబడులు సమకూరుతాయి. * దేశీయంగానూ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠస్థాయికి చేరి 3.16 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్బీఐ
వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లు రాణించడానికి దోహదపడ్డాయి.