Vodafone idea: సుప్రీంలో టెల్కోలకు షాక్‌.. వొడాఫోన్‌ ఐడియా షేర్లు డౌన్‌

Vodafone idea: సుప్రీంలో టెల్కోలకు షాక్‌.. వొడాఫోన్‌ ఐడియా షేర్లు డౌన్‌

Play all audios:


Vodafone Idea | దిల్లీ: టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిల నుంచి ఊరట కల్పించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత


న్యాయస్థానం కోర్టు (Supreme court) తిరస్కరించింది. దీంతో వొడాఫోన్‌ ఐడియా షేర్లు కుప్పకూలాయి. ఇంట్రాడేలో వీఐ షేర్లు 10 శాతం మేర క్షీణించాయి. ఏజీఆర్‌ బకాయిలపై వడ్డీ, పెనాల్టీలు, పెనాల్టీలపై


వడ్డీ నుంచి తమకు మినహాయింపు కల్పించాలని టెలికాం సంస్థలు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాము


మనుగడ సాధించాలంటే ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి రూ.45వేల కోట్లు మాఫీ చేయాలని తొలుత వొడాఫోన్‌ ఐడియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎయిర్‌టెల్‌ కూడా ఇదే తరహా పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ


చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నిర్ణయంతో టెలికాం సంస్థలపై భారం పడనుందన్న భయంతో షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి వీఐ షేర్లు 8.41


శాతం నష్టంతో, ఎయిర్‌టెల్‌ 0.14 శాతం లాభంతో ముగిశాయి. సుప్రీంకోర్టుకు వొడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్‌లో రూ.83,400 కోట్లను ఏజీఆర్‌ బకాయిలుగా పేర్కొంది. ఇందులో రూ.12,797 కోట్లు ప్రిన్సిపల్,


రూ.28,294 కోట్ల వడ్డీ, రూ.6,012 కోట్ల జరిమానా, రూ.11,151 కోట్ల జరిమానాలపై వడ్డీ ఉన్నాయని పేర్కొంది. ఇటీవల రూ.36,950 కోట్ల స్పెక్ట్రమ్‌ బకాయిలను, ఈక్విటీగా మార్చుకోవడంతో వొడాఫోన్‌ ఐడియాలో


ప్రభుత్వం వాటా 48.99 శాతానికి చేరింది. అంతకు ముందు కంపెనీలో ప్రభుత్వానికి 22.6 శాతం వాటా ఉండేది. ఇక భారతీ ఎయిర్‌టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ ఏజీఆర్‌ కింద అసలు రూ.9,235 కోట్లు


చెల్లించాల్సి ఉంది. వడ్డీ రూ.21,850 కోట్లు, జరిమానాలు రూ.3,995 కోట్లు, జరిమానాలపై వడ్డీ రూ.8,900 కోట్లు కలిపితే ఈ మొత్తం రూ.43,980 కోట్లకు చేరుకుందని ఎయిర్‌టెల్‌ దాఖలు తన పిటిషన్‌లో


తెలిపింది.