
Saraswati river pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు.. మీకివి తెలుసా?
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఈ నెల 26 వరకు జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 12 ఏళ్లకు
ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని, జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంతకీ సరస్వతి నదీ ఎక్కడ పుట్టింది.. పుష్కరాల చరిత్ర ఏంటో తెలుసుకుందాం.. రుగ్వేదంలో సరస్వతి నది
ప్రస్తావన ఉంది. హిమాలయ పర్వతశ్రేణిలోని శివాలిక్ కొండల్లో ఈ నది ప్రవహించినట్లు రుగ్వేదంలో పేర్కొన్నారు. పాకిస్థాన్లోని హక్రా, భారత్లోని గగ్గర్ నదే.. అప్పటి సరస్వతి నది అని చరిత్రకారులు,
భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాచల్ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లో ప్రారంభమై పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహించిందని భావిస్తున్నారు. అయితే,
కొన్ని వేల సంవత్సరాల కిందటే భూగర్భం, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సరస్వతి నది అదృశ్యమైపోయింది. కానీ, భూగర్భంలో ఇంకా ఈ నది ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఇతర నదులతో అంతర్వాహినిగా
కలుస్తుందట. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. ఎక్కడెక్కడ..? భూపాలపల్లి జిల్లా మహదేవ్పుర్
మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరినదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. ఈ రెండు నదులు సంగమించిన చోటే సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక్కడ మహా
సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పుష్కరాలను నిర్వహిస్తుంటారు. బద్రినాథ్కు సమీపంలో ఉన్న మనా గ్రామంలో సరస్వతి
నదిని చూడొచ్చు. ఇది కొంత దూరం ప్రవహించి.. అలకనంద నదిలో కలిసిపోతుంది. ప్రయాగ్రాజ్లో గంగా, యమునా నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చి చేరుతుంది. ఈ త్రివేణి సంగమం జరిగే చోటే సరస్వతి పుష్కరాలు
నిర్వహిస్తుంటారు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన గుజరాత్లోని సోమనాథ్ ఆలయం, రాజస్థాన్లోని పుష్కర్ ప్రాంతంలోని బ్రహ్మ ఆలయం, మధ్యప్రదేశ్లోని బేడాఘాట్ వద్ద ఈ పుష్కరాలు జరుగుతుంటాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి. అందుకే, ప్రభుత్వం దీని నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు రోజుకు
లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భక్తుల కోసం రూ.35 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల
సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర సాన్నాలకు పీఠాధిపతులు పలు రాష్ట్రాల్లోని పీఠాధిపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానమాచరిస్తారని తెలంగాణ దేవాదాయశాఖ తెలిపింది. మే 15న మెదక్ జిల్లా
రంగంపేటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతిస్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు. 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, 18న పుష్పగిరి పీఠాధిపతి
అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, 19న నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి పుష్కరస్నానం
ఆచరించనున్నారు.