
Stock market: భారీ నష్టాల్లో సూచీలు: సెన్సెక్స్ 873 పాయింట్లు డౌన్.. 24,700 దిగువకు నిఫ్టీ
Play all audios:

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ దీనికి తోడైంది. ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు.. తర్వాత భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,700 దిగువకు చేరింది.
నిఫ్టీ ఆటో సూచీ 2 శాతానికి పైగా నష్టపోగా.. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ షేర్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. మిడ్క్యాప్ 100 సూచీ 1.62 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.94
శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.3.50 లక్షలు క్షీణించి రూ.440.23 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 82,116.17 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు
82,059.42) లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 81,153.70 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 872.98 పాయింట్ల నష్టంతో 81,186.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ
261.55 పాయింట్ల నష్టంతో 24,683.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.63గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో
ముగిశాయి. ఎటర్నల్, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. కారణాలు ఇవే.. * అమెరికా ప్రభుత్వ అప్పులపై ఆందోళన
నేపథ్యంలో యూఎస్ క్రెడిట్ రేటింగ్ను మూడీస్ డౌన్గ్రేడ్ చేసింది. దీంతో అక్కడి 30 ఏళ్ల బాండ్ రాబడులు 2023 నవంబర్ తర్వాత గరిష్ఠ స్థాయి అయిన 5.03 శాతానికి చేరాయి. బాండ్ రాబడులు పెరగడంతో
భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు లిక్విడిటీ తగ్గొచ్చన్న భయాలతో మన మార్కెట్లు పడ్డాయి. * గత కొన్ని రోజులుగా కొనుగోళ్లవైపు మొగ్గుచూపిన విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) మే 19న అమ్మకాలకు
దిగారు. రూ.526 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.238 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. * భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం స్టాక్
మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో 4 శాతం మేర లాభపడ్డాయి. ఈ క్రమంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం అమ్మకాల ఒత్తిడి కనిపించింది. * ముఖ్యంగా హెచ్డీఎప్సీ బ్యాంక్, రిలయన్స్
ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ వంటి లార్జ్క్యాప్ స్టాక్స్లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. * మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతుండడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది.
ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. భారత్లోని దక్షిణాది రాష్ట్రాల్లో కొత్తగా కొవిడ్ కేసులు నమోదు కావడమూ మార్కెట్ నెగటివ్గా తీసుకుందని అనలిస్టులు
భావిస్తున్నారు.