
Operation sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత జైషే స్థావరం ఇలా.. వీడియో షేర్ చేసిన భాజపా
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’
పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రంపై దాడిని భారీ విజయంగా చెప్పొచ్చు. దాడుల్లో ఈ స్థావరం ధ్వంసమైంది. అందుకు
సంబంధించిన దృశ్యాలను భాజపా (BJP) ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ‘‘పాకిస్థాన్ పంజాబ్
ప్రావిన్స్లోని బహవల్పూర్లో గల మర్కజ్ సుబాన్.. జైషే ముఠా హెడ్క్వార్టర్. ఈ ఉగ్రశిబిరంలోనే జైషే అనేక ఉగ్ర కుట్రలకు పథక రచన చేసింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి కూడా ఇక్కడే
ప్లాన్ చేశారు. ఆ దాడికి పాల్పడిన వారికి ఇక్కడే శిక్షణ అందించారు. ఇప్పుడు ఆ స్థావరాన్ని ధ్వంసం చేశాం’’ అని మాలవీయ రాసుకొచ్చారు. ఆపరేషన్కు ముందు, తర్వాత ఆ ఉగ్ర శిబిరం ఎలా ఉందో వీడియోలో
చూడొచ్చు. దాడి కారణంగా భవనం దెబ్బతింది. గోడలు కూలిపోవడంతో పాటు భారీ గొయ్యి ఏర్పడింది. ఇదే స్థావరంలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు
మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ శిబిరాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా
దీనిలోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.