Operation sindoor: కసబ్‌, హెడ్లీకి శిక్షణ ఇచ్చిన స్థావరాలు ధ్వంసం: ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రకటన

Operation sindoor: కసబ్‌, హెడ్లీకి శిక్షణ ఇచ్చిన స్థావరాలు ధ్వంసం: ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రకటన

Play all audios:


దిల్లీ: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్‌ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 


విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు


వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ మీడియాతో మాట్లాడారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత కచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర


స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదు.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ జరిపిన


తీరును కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్ వ్యోమికా సింగ్‌ వివరించారు. ‘‘పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్‌ చేపట్టాం. గత 30 ఏళ్లుగా పాక్‌ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తోంది.


ఆ దేశంతో పాటు పీఓకేలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయి. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించాం. అందులో తొమ్మిదింటిని లక్ష్యంగా చేసుకున్నాం. కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశాం. పాక్‌


పౌరులకు హాని కలగని రీతిలో వీటిని నిర్వహించాం. సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదు. అర్ధరాత్రి 1.05-1.30 గంటల మధ్య ఈ ఆపరేషన్‌ జరిగింది. భారత్‌ టార్గెట్‌ చేసిన వాటిల్లో.. లాహోర్‌కు 40


కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో గల లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉంది. ఇక్కడ 26/11 ముంబయి దాడులకు పాల్పలడిన ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీ శిక్షణ తీసుకున్నారు’’ అని కర్నల్‌ సోఫియా


ఖురేషి వెల్లడించారు. ఇది ఆరంభం మాత్రమే: మిస్రీ ‘‘పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. కుటుంబసభ్యుల కళ్లముందే అతి కిరాతకంగా పర్యాటకులను చంపేశారు. జమ్మూకశ్మీర్‌లో


కొంతకాలంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. దాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే ఉగ్రదాడికి పాల్పడ్డారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మారణహోమానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం


రగిలిపోయింది. పహల్గాం దాడిపై దర్యాప్తు చేపట్టగా.. దీని వెనుక పాక్‌ హస్తం ఉన్నట్లు బయటపడింది. ఉగ్రమూకలకు పాక్‌ అండగా నిలుస్తోంది. పహల్గాం దాడికి తామే కారణమంటూ టీఆర్‌ఎఫ్‌ ప్రకటించుకుంది.


టీఆర్‌ఎఫ్‌కు పాక్‌ అండదండలున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌పై ఇప్పటికే నిషేధం ఉంది. ఉగ్ర సంస్థలపై నిషేధం ఉండటంతో టీఆర్‌ఎఫ్‌ పేరుతో ఆయా ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పహల్గాం దాడి


తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలను నిఘా సంస్థలు ట్రాక్‌ చేశాయి. భారత్‌పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చాయి. వాటిని అడ్డుకోవడం, ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం అత్యవసరమని భావించాం.


కచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశాం. ఇది ఆరంభం మాత్రమే. పాక్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం సమూలంగా ధ్వంసం చేస్తుందని విశ్వాసంగా ఉన్నాం. అప్పుడే


ఉగ్రవాదాన్ని అడ్డుకోగలం’’ అని మిస్రీ వెల్లడించారు. * ఉగ్రమూక పైకి ఉక్కు డేగలు... ఇనుప సుత్తులు..! దాడుల దృశ్యాలు మీడియాకు.. మీడియా సమావేశంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సంబంధించిన దృశ్యాలను


చూపించారు. సమావేశానికి ముందు గతంలో భారత్‌ జరిపిన మెరుపు దాడుల వీడియోలను ప్రదర్శించారు. చరిత్రలో తొలిసారి మహిళా అధికారులతో.. ఈ ఆపరేషన్ వివరాలను కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా


సింగ్‌లు వెల్లడించారు. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్‌ సంగతులను మహిళా అధికారులు వెల్లడించడం విశేషం. ఈ ఆపరేషన్‌కు కూడా ‘సిందూర్‌’ అని పేరు పెట్టి బలమైన సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ


ఉగ్ర దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీనిని చూడొచ్చు.