
Operation sindoor: దౌత్యంతో మొదలుపెట్టి.. వాణిజ్యాన్ని నొక్కి.. ఉగ్రస్థావరాలను అణగదొక్కి..
Play all audios:

Operation Sindoor ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత అన్నివైపుల నుంచి పాకిస్థాన్ను భారత్ దిగ్బంధించడం మొదలుపెట్టింది. ఆర్థిక, దౌత్య, వాణిజ్యరంగాల్లో దానిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి
పెంచింది. ఆ దేశం ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో ఉండగానే ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని.. సైనిక చర్యను కూడా చేపట్టింది. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు 26 మంది
పర్యాటకులను పొట్టన పెట్టుకొన్నారు. ఈక్రమంలో భార్యలను భర్తలను వేరు చేసి.. వారి మతం అడిగి కాల్చిచంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. దౌత్యంతో కొట్టి.. అదే సమయంలో సౌదీ
పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అర్ధంతరంగా దానిని రద్దు చేసుకొని 23 తేదీన భారత్ చేరుకొన్నారు. ఆయన పీఎంవోకు కూడా వెళ్లకుండా.. ఎయిర్పోర్టులోనే ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిని ప్రభుత్వం
ఎంత సీరియస్గా తీసుకొందో.. ఈ పరిణామాలు చెప్పాయి. పాక్తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి.. ఆ దేశానికి ఊహించని షాక్ ఇచ్చారు. నీటి విడుదలను బాగా తగ్గించేశారు. ఆ దేశ జీడీపీలో దాదాపు
24శాతం ఈ జలాల నుంచే లభిస్తుంది. ఇవే కాకుండా పాక్ సైనిక, రవాణా, పౌర విమానాల కోసం భారత్ గగనతలాన్ని మూసివేసింది. ఇక పాక్ దేశీయుల వీసాలను రద్దు చేసి.. దేశాన్ని వీడాలని ఆదేశించారు.
అట్టారీ-వాఘా బోర్డర్ గేట్లను మూసేసింది. దీంతోపాటు పాక్ నటుడు ఉన్న సినిమా రిలీజ్ను ఆపేశారు. అంతేకాదు.. పాక్ నటీనటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు సహా పలువురి యూట్యూబ్, ఇన్స్టా ఇతర
సోషల్ మీడియా ఖాతాలను భారత్లో బ్లాక్ చేశారు. వీటిలో మహీరా ఖాన్, హానియా ఆమీర్, అలీజఫర్ వంటి వారి ఖాతాలు ఉన్నాయి. వాణిజ్యంపై దెబ్బ పాక్తో వాణిజ్య సంబంధాలను భారత్ పూర్తిగా తెంచుకొంది. మే
నెల ఆరంభంలో పాక్ నుంచి దిగుమతులు, ఆ దేశానికి ఎగమతులను నిలిపివేసింది. పాక్ నౌకలు మన ఓడ రేవుల్లోకి రాకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా దేశానికి ఎగుమతి అయ్యే ఔషధాలపై కూడా ఆంక్షలు విధించింది.
చాలా ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నేరుగా వాణిజ్యం జరగకపోయినా.. యూఏఈ, సింగపూర్, ఇండోనేసియా, శ్రీలంక వంటి దేశాల నుంచి మనకు ఎగుమతులు చేసేది. పండ్లు, ఎండు కర్జూరాలు, టెక్స్టైల్స్, రాక్ సాల్ట్,
లెదర్ వస్తువులు ఉండేవి. వీటి విలువ 500 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు. ఈ మార్గంలో భారత్లోకి పాక్ సరకులు రాకుండా నట్లు బిగించింది. ఐఎంఎఫ్ నుంచి పాక్కు లభించాల్సిన రుణాన్ని
పునఃసమీక్షించాలని భారత్ ఒత్తిడి పెంచేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఉగ్రవాదులకు శిక్ష ఖాయమని ముందే చెప్పి.. ఇటీవల బిహార్లో ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు ఊహిచని
రీతిలో శిక్ష ఉంటుందని పాక్ను హెచ్చరించారు. దీంతో సైనిక చర్య ఖాయమన్న విషయాన్ని ఆయన తేల్చేశారు. ఆ మర్నాడే జరిగిన ఆల్పార్టీ మీటింగ్లో.. అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు
మద్దతు తెలిపాయి. మరోవైపు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని పాక్ దళాలు సరిహద్దుల్లో కాచుకు కూర్చొన్నాయి. ఈ క్రమంలో వరుసగా సైనికాధికారులు, మంత్రులతో జరిగిన భేటీలు దాయాది దేశ నాయకుల్లో ఆందోళన
పెంచాయి. దీంతో పాక్ నేతలు అణు బెదిరింపులకు దిగారు. అయినా భారత్ మౌనంగా తన ఏర్పాట్లు తాను చేసుకొంటూ వెళ్లింది. అమెరికా, రష్యా ఫ్రాన్స్, సౌదీ, యూఏఈ వంటి కీలక మిత్ర దేశాలకు పరిస్థితిని
వివరించింది. ఐరాస భద్రతా మండలిలో కూడా పాక్ ఎటువంటి మద్దతు రాకుండా దౌత్యం నెరిపింది. దేశ ప్రజల కోసం వార్ మాక్ డ్రిల్స్ను మే7వ తేదీన నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవి మొదలుకావడానికి
కొన్ని గంటల ముందే పాక్ ఊహించనివిధంగా దాడి చేసి 9 ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది.