
Tunnel rescue: ‘ప్రాణాలకు తెగించాం.. కానీ.. ’ ర్యాట్ హోల్ మైనర్ల ఆవేదన
Play all audios:

సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ‘ర్యాట్ హోల్ మైనర్లు’.. ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల తమకు అందజేసిన రూ.50
వేల సాయం ఏ మాత్రం సముచితం కాదని పేర్కొన్నారు. దెహ్రాదూన్: ఇటీవల ఉత్తర్కాశీలోని సిల్క్యారా సొరంగం (Silkyara Tunnel)లో చిక్కుకుపోయిన కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకురావడంలో ‘ర్యాట్
హోల్ మైనర్ల (Rat-hole Miners)’ది కీలక పాత్ర. ఆరు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆపరేషన్ చేపట్టినప్పటికీ.. అత్యంత ప్రమాదకరమైన ‘ర్యాట్ హోల్ మైనింగ్’ విధానంలోనే సొరంగంలో చిక్కుకున్న కూలీలను
రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయి. ఈ క్రమంలోనే ‘ర్యాట్ హోల్ మైనర్ల’ సేవలకు ప్రతిఫలంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇటీవల 12 మందిని రూ.50 వేల చొప్పున చెక్కులతో సత్కరించారు. అయితే, ఈ
ఆపరేషన్లో తాము పోషించిన పాత్రకు.. ప్రభుత్వ సాయానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చెక్కులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు! ‘‘ఆ రోజు చాలా అసాధ్యకర పరిస్థితి.
యంత్రాలు విఫలమైన వేళ.. మేం సొరంగంలోకి అడుగుపెట్టాం. ఎటువంటి ముందస్తు షరతులు విధించకుండా.. మా ప్రాణాలను పణంగా పెట్టి శిథిలాలను తొలగించాం. ఈ ఆపరేషన్లో ‘ర్యాట్ హోల్ మైనర్ల’ది వీరోచిత పాత్ర.
ఈ క్రమంలోనే సీఎం చూపిన చొరవకు కృతజ్ఞతలు. కానీ, మా సేవలను లెక్కలోకి తీసుకుంటే.. ప్రభుత్వం అందించిన మొత్తంతో సంతృప్తిగా లేం. ఇది మా మనోధైర్యాన్ని తగ్గిస్తుంది. చెక్కులు అందజేసిన రోజే మా
అసంతృప్తి తెలియజేశాం. దీంతో త్వరలోనే ప్రకటన చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వారు తమ మాట నిలబెట్టుకోకుంటే.. చెక్కులు తిరిగి ఇచ్చేస్తాం’’ అని ‘ర్యాట్ హోల్ మైనర్ల’ బృందానికి నాయకత్వం వహించిన
వకీల్ హసన్ ‘పీటీఐ’కి చెప్పారు. Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది! శాశ్వత ఉద్యోగం లేదా నివసించడానికి ఇల్లు ఇస్తే మరింత సముచితంగా ఉండేదని.. ఆ రోజు సొరంగంలోని కార్మికుల
వద్దకు మొదటగా చేరుకున్న మున్నా ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా.. నవంబరు 12న 41 మంది కార్మికులు సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయారు. కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో
అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. డ్రిల్లింగ్ కోసం తీసుకొచ్చిన యంత్రం బ్లేడ్లు విరిగిపోయాయి. మొత్తం 57 మీటర్లకుగానూ ఆ యంత్రం అప్పటికే 47 మీటర్లు తవ్వింది. ఈ క్రమంలోనే 12 మంది ‘ర్యాట్ హోల్
మైనర్ల (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు)’ను రంగంలోకి దించారు. మిగతా డ్రిల్లింగ్ పనిని వీరు చేతులతో చేపట్టారు. చివరకు నవంబరు 28న కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.