
India operations: ఆపరేషన్ ‘మేఘ్దూత్ నుంచి సిందూర్’ వరకు
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్ (Pakistan).. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్పై ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్న సంగతి తెలిసిందే.
వీటికి దీటుగా స్పందిస్తున్న భారత్.. ప్రతీకార దాడులతో బుద్ధిచెబుతున్నప్పటికీ దాయాది దేశం తీరు మారడం లేదు. ఇటీవల పహల్గాంలోనూ పర్యటకులపై ఊచకోతకు పాల్పడింది. ప్రతీకారంగా పాక్ ఉగ్ర స్థావరాలపై
భారత్ విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాడిచేసి పదుల సంఖ్యలో ముష్కర మూకలను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో గత ఏడు దశాబ్దాల్లో పాక్పై మనం చేపట్టిన కీలక సైనిక
ఆపరేషన్లను పరిశీలిస్తే.. ఆపరేషన్ సిందూర్.. పహల్గాంలో ఏప్రిల్ 22న అక్కడి పర్యటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 26 మందిని కాల్చి చంపారు. కన్నవారి, కట్టుకున్నవారి కళ్లముందే ప్రాణాలు తీసిన తీరు
యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన భారత్.. పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మొత్తం తొమ్మిది ఉగ్ర
స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది. బాలాకోట్.. 2019 పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు.. 40
మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. జైషే మహమ్మద్ ఈ దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారంగా బాలాకోట్లో జైషే ఉగ్ర స్థావరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన వైమానిక దాడులు (Balakot
Strike) చేసింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం అదే తొలిసారి. * పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు సర్జికల్ స్ట్రైక్స్.. 2016 2016
సెప్టెంబర్లో జమ్మూకశ్మీర్ ఉరిలోని భారత సైనిక స్థావరంపై మిలిటెంట్లు దాడులకు తెగబడి 19 మందిని చంపేశారు. అనంతరం పది రోజుల తర్వాత వ్యూహాత్మకంగా స్పందించిన భారత సైన్యం.. పీవోకేలో ఉన్న ఉగ్ర
స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ (Surgical strikes) నిర్వహించింది. అనేక మంది ఉగ్రవాదులను అంతం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో సరికొత్త పంథాను అనుసరిస్తున్నట్లు ఆ ఘటనతో భారత్
నిరూపించుకుంది. కార్గిల్లో ‘ఆపరేషన్ విజయ్’.. 1999 జమ్మూకశ్మీర్ కార్గిల్ సెక్టార్లో 1999 మే నెలలో పాక్ సైన్యం అక్రమంగా చొరబడింది. దీంతో భారత్ ఆపరేషన్ విజయ్ (Operation Vijay)ను
చేపట్టింది. భారత్ వాయుసేన కూడా సైన్యానికి తోడ్పాటు అందించింది. భీకర యుద్ధంలో పైచేయి సాధించిన భారత్.. జులై నాటికి ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అందుకే జులై 26ను కార్గిల్ విజయ్
దివస్గా నిర్వహించుకుంటున్నాం. ఆపరేషన్ మేఘ్దూత్.. లద్దాఖ్లోని సియాచిన్ గ్లేసియర్లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ‘ఆపరేషన్ మేఘ్దూత్’ (Operation Meghdoot)ను భారత్
చేపట్టింది. సాల్టోరో రిట్జ్పై పైచేయి సాధించిన భారత బలగాలు.. ఆ ప్రాంతంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేశాయి. అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
ఇప్పటికీ అక్కడ మన బలగాల గస్తీ ఉంటుంది. ఆపరేషన్ ట్రైడెంట్.. 1971 తూర్పు పాకిస్థాన్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న వేళ.. భారత్పై పాకిస్థాన్ దాడులకు తెగబడింది. ఇది కాస్త ఇరుదేశాల మధ్య
యుద్ధానికి దారితీసింది. అదే సమయంలో 1971 డిసెంబర్ 4న.. కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా భారత్ నౌకాదళం ‘ఆపరేషన్ ట్రైడెంట్’ (Operation Trident) చేపట్టింది. రంగంలోకి దిగిన భారత్ క్షిపణి బోట్లు..
ఊహించని రీతిలో పాక్ నౌకాదళ ఆస్తులు, ఇంధన నిల్వలను ధ్వంసం చేశాయి. ఆ యుద్ధంలో భారత్ నౌకాదళం ఆధిపత్యం కనబరిచింది. చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఆ యుద్ధం ముగిసింది. పాక్..ఆపరేషన్
జిబ్రాల్టర్.. 1965 కశ్మీర్ను ఆక్రమించాలనుకునే ఉద్దేశంతో పాకిస్థాన్ సైన్యం 1965లో సైనిక చర్య చేపట్టింది. పాక్ సైనికులు, తిరుగుబాటుదారులు మారువేషంలో కశ్మీర్లోకి చొరబడేందుకు చేపట్టిన
కోవర్ట్ ఆపరేషన్ ఇది. దానికి ఆపరేషన్ జిబ్రాల్టర్ (Operation Gibraltar) పేరు పెట్టారు. దీనిని భారత్ సైన్యం దీటుగా తిప్పికొట్టింది. ఇరువైపులా భారీగా ప్రాణనష్టం జరిగింది. భారత్-పాక్ మధ్య
రెండో అతిపెద్ద యుద్ధానికి దారితీసింది. ఐరాస నిర్దేశించిన కాల్పుల విరమణ, 1966లో తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఆ ఘర్షణకు ముగింపు పడింది. భారత్-పాక్ తొలి యుద్ధం.. భారత్-పాక్లు
స్వాతంత్ర్యం పొందిన కొన్ని నెలలకే ఇరుదేశాల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీన్నే మొదటి కశ్మీర్ యుద్ధంగా పేర్కొంటారు. పాకిస్థాన్ మద్దతున్న ట్రైబల్ మిలీషియా దళాలు కశ్మీర్ను ఆక్రమించాయి. అప్పుడు
అక్కడి మహారాజు భారత్లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు భారత్ బలగాలను అక్కడికి పంపించడంతో ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైంది. 1948 వరకు ఇది కొనసాగింది. ఐరాస
జోక్యంతో ఇరుదేశాలు కాల్పులు విరమించాయి. జమ్మూకశ్మీర్లో మూడింట రెండొంతుల భూభాగం భారత్ చేతికి రాగా.. మిగతా భాగం పాక్ నియంత్రణలో ఉండిపోయింది. దాన్నే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)గా
పేర్కొంటున్నాం.