
Indus treaty: సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్కు పాకిస్థాన్ విజ్ఞప్తి
Play all audios:

Indus treaty | దిల్లీ: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్థాన్కు తెలుసొచ్చింది. మొన్నటి వరకు ఈ అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన దాయాది ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు
తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్.. సింధూ జలాల విషయంలో వెనక్కి ‘తగ్గేదే లే’ అని ప్రకటించడంతో ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలంటూ కోరింది. ఈ
మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. సింధూ జలాలు నిలిపివేస్తే పాక్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయంలో
చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రోటోకాల్లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది. అయితే, రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవంటూ ఈ విషయంలో
వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టంచేశారు. పాక్తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్పైనే అని పేర్కొన్నారు. ఏమిటీ ఒప్పందం..? పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి
అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సింధూ, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఒప్పందం
1960లో కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్
కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్థాన్కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు
చేసింది.