
Paradip: నౌకలో 21 మంది పాక్ సిబ్బంది.. ఆ పోర్టులో హైఅలర్ట్
Play all audios:

(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఒడిశాలోని పరదీప్
పోర్టు(Paradip port)కు వచ్చిన ఓ షిప్ కలకలం రేపింది. అందులో 21 మంది పాకిస్థాన్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించడమే అందుకు కారణం. దీంతో ఆ పోర్టులో భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలో
హైఅలర్ట్ ప్రకటించారు. బుధవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా ఓ నౌక పరదీప్ పోర్టుకు చేరింది. ‘ఎమ్టీ సైరెన్ II’ పేరుతో ఉన్న ఈ షిప్లో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇది
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ కోసం ముడి చమురును తీసుకొచ్చింది. తనిఖీలు చేపట్టగా సిబ్బందిలో 21 మందిని పాకిస్థానీయులుగా గుర్తించారు. * ఉద్రిక్తతలు తగ్గాలంటే భారత్-పాకిస్థాన్ కలిసి
డిన్నర్ చేయాలి.. ట్రంప్ నోట మళ్లీ అదే పాట ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి దీనిగురించి సమాచారం అందడంతో వెంటనే ఒడిశా మెరైన్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోర్టులో
భద్రతను మరింత పెంచినట్లు మెరైన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా దుహేరి తెలిపారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓడరేవు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని
సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ నౌక పోర్టుకు 20 కి.మీ. దూరంలోని ‘పీఎం బెర్త్’ వద్ద లంగర్ వేసి ఉంది. ఇందులో 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముడి చమురు
అన్లోడింగ్ పూర్తయ్యే వరకూ 25 మంది సిబ్బంది నౌకను వీడకుండా భద్రతా ఏర్పాట్లుచేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.