
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదా
Play all audios:

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(CBSE) ఇటీవల ఆదేశించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై
తాజాగా దిల్లీ ఎయిమ్స్ మీడియా విభాగం ఇంఛార్జి, అనాటమీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రిమా దాదా(Dr Rima Dada) స్పందించారు. ‘‘ఇది ఎంతో కీలకమైన ఆదేశం. పదేళ్ల వయసున్న పిల్లల్లో అధిక రక్తపోటు, మధుమేహం
అభివృద్ధి చెందుతున్నాయి. ఇందుకు కారణం వారు పాటిస్తున్న అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. పిల్లల రోజువారీ ఆహారంలో చక్కెరలు 5శాతం కంటే మించరాదు. కానీ అది 15శాతం, అంతకన్నా ఎక్కువగా ఉంటోంది.
తల్లిదండ్రులు, పిల్లలకు దీని గురించి తెలియదు. వారికి అవగాహన కూడా లేదు.’’ * ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ‘‘పాఠశాలల్లో క్యాండీలు, ఇతర చక్కెర పదార్థాలు
అందుబాటులో ఉండటంతో పిల్లలు వాటినే తింటున్నారు. పాఠశాల క్యాంటీన్లలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలి. పిల్లలకు వైవిధ్యమైన ఆహారం ఇవ్వాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన గింజలు,
తృణధాన్యాలు వంటివి ఇవ్వడంపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి. తద్వారా పిల్లల శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది. సీబీఎస్ఈ ఇచ్చిన ఆదేశాలు స్వాగతించాలి’’ అని ఆమె
తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీబీఎస్ఈ బోర్డు ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించేలా విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు
పాఠశాలల్లో ‘చక్కెర బోర్డులు’ ఏర్పాటు చేయాలని అనుబంధ పాఠశాలలకు సూచించింది. ఇటీవలి కాలంలో పిల్లల్లో టైప్ 2 మధుమేహం కేసులు పెరుగుతున్న వేళ చక్కరను అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య
సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాల పరిసరాల్లో విక్రయించే చిరుతిళ్లు, శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో చక్కెర వినియోగం పెరుగుతోందని, దీంతో వారిలో
మధుమేహంతో పాటు ఊబకాయం, దంత సమస్యలవంటి రుగ్మతలు పెరుగుతున్నాయని సీబీఎస్ఈ పేర్కొంది.