
Shashi tharoor: మాటమీద నిలబడని వారిని మనమెలా విశ్వసిస్తాం.. పాక్పై థరూర్ విమర్శలు
Play all audios:

దిల్లీ: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దాయాది దేశం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ (Ceasefire
Violation).. సరిహద్దుల వద్ద మళ్లీ కాల్పులకు తెగబడింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) పాక్ తీరుపై మండిపడ్డారు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం, మాట మీద నిలబడకపోవడం పాక్
స్వభావం అయినప్పుడు.. వారి వాగ్దానాలను మనం ఎలా విశ్వసించగలమని ప్రశ్నించారు. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని థరూర్ అన్నారు. కానీ..
ఉగ్రవాదులు మన దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో వారికి తెలిసేలా చేశామన్నారు. దీని నుంచైనా దాయాది దేశం గుణపాఠం నేర్చుకొని ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల
అమలు చేసిన ఆపరేషన్ సిందూర్ను ప్రశంసించారు. దీంతో భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. * కాల్పుల విరమణ.. గంటల్లోనే పాక్ ఉల్లంఘన భారత్- పాక్ శాంతికి అంగీకరించాయని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అనంతరం భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం
భూతల, గగనతల, సాగరజలాల్లో అన్నిరకాల కాల్పులు, సైనిక చర్యలను భారత్-పాక్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి పాకిస్థాన్ బేషరతుగా అంగీకరించిందని తెలిపారు. రెండు దేశాల డీజీఎంవోలు శనివారం
సాయంత్రం 3.35 గంటల సమయంలో నేరుగా మాట్లాడుకున్నారని.. రెండువైపులా అన్నిరకాల సైనిక కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయించారని అన్నారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఒప్పందాన్ని
ఉల్లంఘిస్తూ..జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాలపైకి పాకిస్థాన్ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో గగనతల రక్షణ వ్యవస్థల్ని ఉపయోగించి.. భారత్ వాటిని కూల్చేసింది.