
Operation sindoor: పీవోకేను అప్పగించడంపై తప్ప వేరే చర్చల్లేవ్: భారత్
Play all audios:

దిల్లీ: కశ్మీర్ విషయంలో తమకు స్పష్టమైన వైఖరి ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) తిరిగి రావడమనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత
ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. ఈ నెల 7న పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాక్ డీజీఎంవోకు సమాచారం ఇచ్చామని, చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పామని వెల్లడించాయి.
అయితే, పాకిస్థాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని తెలిపాయి. ఇరుదేశాల మధ్య కాల్పులు తీవ్ర స్థాయికి చేరుకున్న తర్వాత మే 10న పాకిస్థాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చినట్లు పేర్కొన్నాయి.
భారత్ జరిపిన దాడుల్లో రహిమ్యార్ఖాన్ వైమానిక స్థావరం రన్వే నేలమట్టమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిలేదని స్పష్టం చేశాయి. ‘‘ బహావల్పూర్లోని జైషే
మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేశాం. పాకిస్థాన్ను బలంగా, భారీగా, అత్యంత సుదూర ప్రాంతాల్లో దెబ్బతీశాం. అటువైపు నుంచి బుల్లెట్లతో దాడి చేస్తే.. మనం బాంబులతో సమాధానం
ఇచ్చాం. బహవల్పూర్తోపాటు మురుద్కే, ముజఫర్బాద్ ఉగ్రవాద కేంద్రాలను నేలమట్టం చేశాం. మే 10న పాకిస్థాన్ దాడికి ప్రతిస్పందనగా అగ్ని వర్షం కురిపించాం. మొత్తం 8 స్థావరాలు లక్ష్యంగా దాడులు
చేశాం’’ అని ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు ‘‘కశ్మీర్ విషయంలో భారత్కు స్పష్టమైన వైఖరి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ను అప్పంగించడం మినహా మరో విషయం
లేదు. అంతకుమించి మాట్లాడేది లేదు. ఉగ్రవాదుల అప్పగింతపై వాళ్లు మాట్లాడితే మేమూ మాట్లాడుతాం. మరో విషయంపై మాట్లాడే ఉద్దేశం మాకు లేదు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదు. ఎవరూ
మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరమూ లేదు’’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాక్కు దెబ్బకొట్టాం.. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ మూడు లక్ష్యాలను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
సైనికంగా, రాజకీయంగా, మానసికంగా పాక్ను దెబ్బకొట్టినట్లు తెలిపాయి. ప్రతి రౌండ్లోనూ పాకిస్థాన్ పరిస్థితి మరింత దిగజారిందని, భారత్ చేతిలో ఓటమి పాలైందని వెల్లడించింది. పాకిస్థాన్ వైమానిక
స్థావరాలపై భారత్ దాడి చేయగా.. ఇక పోరాడలేమని దాయాది దేశం తెలుసుకున్నట్లు పేర్కొన్నాయి.