
Puri musings: ‘సూసేగాడ్’ లైఫ్స్టైల్.. అందుకే మనం గోవా వెళ్తాం: పూరి జగన్నాథ్
Play all audios:

Puri Musings || జీవితంలో ఎక్కువ ఒత్తిడి లేకుండా మనశ్శాంతిగా, సంతృప్తిగా, హాయిగా ఉండే లైఫ్స్టైల్ పోర్చుగీస్ వారి నుంచి మనకు వచ్చిందని, దాన్ని సూసేగాడ్ అంటారని దర్శకుడు పూరి జగన్నాథ్
(Puri Jagannadh) అన్నారు. పూరి మ్యూజింగ్స్పేరుతో ఆయన వివిధ అంశాలపై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘పోర్చుగీస్’ జీవనవిధానంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘వాస్కోడగామా 1498లో
కేరళలో కాలికట్కు చేరుకున్నాడు.ఆయన వచ్చిన సముద్రమార్గం ద్వారా భారత్-యూరప్ మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత పోర్చుగీస్ వాళ్లు గోవాను జయించి తమ ప్రధాన కేంద్రంగా
మార్చుకున్నారు. నెమ్మదిగా డయ్యూ-డామన్, కోచి, ముంబయి ఇలాంటి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇండియాలో క్రైస్తవాన్ని విస్తృతం చేసింది వీళ్లే. గోవాలోని బస్లికా ఆఫ్ బామ్ జీసెస్, సే
కెథడ్రిల్ వంటి పెద్ద పెద్ద చర్చిలు నిర్మించారు. అప్పటి నుంచి గోవాలో క్రైస్తవం పెరిగింది. క్రిస్మస్, ఈస్టర్లాంటి పండగలు చేసుకోవడం మొదలు పెట్టారు. రంగు రంగుల ఇళ్లు, బాల్కనీలు, టైల్స్తో
ఇంటి పైకప్పులు వేయడం వాళ్లే అలవాటు చేశారు’’ * ముగ్గురు పెళ్లాలు.. నాలుగు జతల బట్టలు.. లాడెన్ గురించి తెలియని విషయాలివే! ‘‘పోర్చుగీస్ భాష, స్థానిక కొంకిణితో కలిసిపోయింది. వెనిగర్, టొమాటో,
బంగాళాదుంప, పచ్చిమిర్చిని మనకు పరిచయం చేసింది వీళ్లే. వెనిగర్తో చేసిన మాంసం, గోవన్ చేపలకూర..తదితర వంటకాలను ఇండియన్స్ కూడా ఆస్వాదించడం మొదలు పెట్టారు. చాలా మందికి గోవన్ ఫుడ్ ఇష్టం. ఈ
పోర్చుగీసు వాళ్లు ఇక్కడి స్థానికులను పెళ్లి చేసుకోవడం వల్ల ఇండో-పోర్చుగీస్ సొసైటీ ఏర్పడింది. వాళ్ల ప్రభావం వల్లే ఇప్పటికీ గోవాలో కార్నివాల్స్ చూస్తున్నాం. గోవన్ మ్యూజిక్ చాలా భిన్నంగా
ఉంటుంది. గోవాలో పోర్చుగీసు వాళ్లు వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేశారు. ఇది లోకల్గా ఉన్న కొంకిణి మ్యూజిక్తో కలిసి ఒక ప్రత్యేక సంగీతం ఏర్పడింది. పోర్చుగల్ ఫ్యాడో అనే మ్యూజింగ్
ఉంది. అది ఇక్కడ ఉన్న మ్యూజిక్తో కలిసి ‘మాండో’ అనే డ్యాన్స్ మొదలైంది. వాళ్లు వేసుకునే బట్టలు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి’’ ‘‘ఆసియాలో మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ పెట్టింది గోవాలోనే. ఈ
పోర్చుగీస్ వాళ్లు మసాలా దినుసులతో వ్యాపారం చేసేవారు. ముఖ్యంగా మిరియాలు, దాల్చిన చెక్క దిగుమతి చేసుకునేవారు. బిజినెస్ విషయంలో బ్రిటిష్, డచ్చితో వీళ్లకు విపరీతంగా గొడవలు అయ్యాయి. దీంతో
పోర్చుగీస్ వారు భారత దేశంలో బలమైన నావికా దళాన్ని సృష్టించారు. పోర్చుగీస్ వారి వల్ల ప్రజలకు ఒక సరికొత్త లైఫ్ స్టైల్ అలవాటైంది. దాని పేరు సూసేగాడ్. అంటే జీవితంలో ఎక్కువ ఒత్తిడి లేకుండా
బతకడం. మనశ్శాంతిగా, సంతృప్తిగా, హాయిగా ఉండటం. గోవాలో ఉండేవాళ్లు ఒక రకమైన విశ్రాంతి ధోరణిలో బతుకుతారు. మధ్యాహ్నం నిద్రపోవటం వీరికి అలవాటు. దీనిని సియస్ట్ అంటారు. గోవా వెళ్లినప్పుడు మనం
వాళ్లలాగానే ఉంటాం. సెల్ఫోన్స్ వాడటం వీళ్లకు పెద్దగా ఇష్టం ఉండదు. సూసేగాడ్ దెబ్బ తింటుందని టవర్స్ పెట్టనివ్వరు. అందుకే మీకు గోవాలో సెల్ఫోన్ సిగ్నల్ సరిగా ఉండదు. 1961లో భారత సైన్యం
‘ఆపరేషన్ విజయ్’ చేపట్టి, గోవా, డయ్యూ డామన్లను దేశంలో విలీనం చేసింది. పోర్చుగీసు వాళ్లు బ్రిటిషర్ల మాదిరిగా ఇండియా మొత్తం వ్యాపించలేదు కానీ, వాళ్ల ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఏదేమైనా
ఇప్పటికీ ఇండియన్స్కి వాళ్ల కల్చర్ అంటే ఇష్టం. అందుకే మనందరం గోవా వెళ్తుంటాం. ఆ కల్చర్ ఆస్వాదిస్తుంటాం’’ అని పూరి జగన్నాథ్ అన్నారు.