
Israel-hamas: ఆగని మృత్యఘోష.. గాజాలో 60 మంది మృతి
Play all audios:

డెయిర్ అల్-బలా: ఇజ్రాయెల్ భారీగా దాడులకు పాల్పడుతుండడంతో గాజాలో మరణమృదంగం మోగుతోంది. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు మృతి చెందుతున్నారు. తాజగా గాజా స్ట్రిప్ అంతటా సోమవారం రాత్రి
నుంచి మంగళవారం ఉదయం వరకు టెల్అవీవ్ చేసిన వైమానిక దాడుల్లో 60 మంది మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. ఉత్తర గాజాలో పనిచేస్తున్న మూడు ఆసుపత్రులూ తమ సేవలను నిలిపివేస్తున్నట్లు
ప్రకటించడంతో క్షతగాత్రులకు చికిత్స అందించడం సమస్యగా మారిందని అధికారులు వాపోయారు. ఇందులో గాజా ప్రజలకు వైద్యం అందిస్తున్న ఇండోనేసియా ఆసుపత్రి కూడా ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా
ఇజ్రాయెల్.. గాజాపై దాడులను తీవ్రతరం చేసింది. వారంలోనే టెల్అవీవ్ దాడుల్లో వేలమంది పాలస్తీనియన్ల ప్రాణాలు పోగొట్టుకొన్నారు. మొన్నటివరకు వైమానిక దాడులే అధికంగా చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్
ఇప్పుడు భూతల దాడులను పెంచింది. జబాలియా శరణార్థి శిబిరంతో పాటు.. అల్ మువాసీలో గుడారాల్లో తల దాచుకుంటున్న వారిపైనా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు
కోల్పోతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించనందునే ఈ దాడులను తీవ్రం చేసినట్లు ఇటీవల నెతన్యాహు వెల్లడించిన సంగతి తెలిసిందే. * గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం:
నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ.. గాజా (Gaza) మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంటామని వెల్లడించారు.
దౌత్య కారణాలకు లోబడి గాజాలో క్షామాన్ని నివారించాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని చెప్పారు. ‘‘మా పోరాటం తీవ్రస్థాయిలో ఉంది. మేం పురోగతి సాధిస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి
తీసుకుంటాం. ఇందులో వెనక్కి తగ్గేదేలేదు. విజయం సాధించాలంటే.. మనల్ని అడ్డుకోలేరనేవిధంగా వ్యవవహరించాలి’’ అని టెలీగ్రామ్ వేదికగా నెతన్యాహు ఒక వీడియోను పోస్టు చేశారు.