
Operation sindoor: పుల్వామా దాడి మా పనే: అంగీకరించిన పాక్ వాయుసేనాధికారి
Play all audios:

Pakistan | ఇంటర్నెట్డెస్క్: కశ్మీర్లోని పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబుదాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్
మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ప్రెస్మీట్లో అంగీకరించారు. దీంతో ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని ఇస్లామాబాద్లోని నేతలు చెబుతున్నవి మొత్తం కాకమ్మ కబుర్లే అని తేలిపోయింది. ఇటీవల ఆపరేషన్ సిందూర్
సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో డీజీఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి, నేవీ ప్రతినిధితో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘పాక్కు చెందిన
గగనతలం, భూభాగం, జల సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే.. వాటిని ఎదుర్కొనేందుకు మేం రాజీ పడబోం. దానిని పట్టించుకోకుండా ఉండలేం.. మా దేశానికి కట్టుబడి ఉంటాం. మా దేశ ప్రజల కీర్తి మొత్తం
దళాల్లోనే ఇమిడి ఉండటంతో.. మేము ఎప్పుడూ దానిని నిలబెట్టుకుంటాం. పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించాం. మా కార్యదక్షత.. వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించాం’’ అని వ్యాఖ్యానించారు.
ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. నాడు పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాకిస్థాన్ ఎంత బుకాయించినా .. తాజాగా వాయుసేనాధికారి
వ్యాఖ్యలతో వాస్తవం బయటకు వచ్చింది. తాజాగా పహల్గాం దాడిపై కూడా ఇలానే స్పందిస్తోంది.