
Ap news: హంద్రీనీవాపై బహిరంగ చర్చకు సిద్ధమా..? : వైకాపా నేతలకు కాలవ శ్రీనివాసులు సవాల్
Play all audios:

రాయదుర్గం: హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిలో ఏ ప్రభుత్వ పాత్ర ఎంతో నిగ్గుతేల్చడానికి బహిరంగ చర్చకు రావాలని వైకాపా నేతలకు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సవాల్
విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఉన్నఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని మండిపడ్డారు. ‘‘ప్రజాప్రతినిధులుగా
జిల్లాలో అనేక పదవులు చేపట్టి, నీటిపారుదలపై అవగాహన ఉన్న వైకాపా నేతలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శివరామిరెడ్డిలు వారి పాలనలో ఏం చేశారో చెప్పగలరా? 2014 నుంచి ఇప్పటి వరకు ఏ
ప్రభుత్వంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? జరిగిన అభివృద్ధి ఎంత అనే విషయంపై బహిరంగ చర్చలో వివరించడానికి మేం సిద్ధం. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమకు రావాల్సిన నీటిని
పూర్తిగా ఇవ్వకుండా ప్రజలను నిలువునా ముంచేశారు. అనంతపురం జిల్లా భవిష్యత్తును సర్వనాశనం చేసిన వైకాపా నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత వైకాపా
పాలనలో ఆగిన పనులు మళ్లీ వేగం అందుకున్నాయి. ఆ మహానుభావుడి చలవతోనే హంద్రీనీవాకు రూపకల్పన రాయలసీమ దత్తపుత్రుడు దివంగత ఎన్టీఆర్ ఆలోచన నుంచే హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయి.
రాయలసీమకు శాశ్వత ప్రాతిపదికన కృష్ణ జలాలు తరలించడానికి ఆ రోజుల్లో ఆయన చేసిన కృషితోనే ఆ రెండు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. ఆయన స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు మాల్యాల నుంచి జీడిపల్లి
రిజర్వాయర్ వరకు 216 కి.మీ వరకున్న కాలువ ద్వారా 3,850 క్యూసెక్కుల నీటి సరఫరాకు అనుగుణంగా కాలువ పనులు చేపట్టారు. ఇటీవల ఉరవకొండ పర్యటనలోనే సీఎం జులై 10నాటికి నీటిని విడుదల చేస్తామని
ప్రకటించారు. తొలిదశలో భాగంగా చేపట్టిన పనుల ద్వారా జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగు, లక్షల మందికి తాగు నీరు అందుతుంది. రాయదుర్గం
నియోజకవర్గం పరిధిలోని ఆవులదట్ల, మాల్యం బ్రాంచ్ కాలువల పరిధిలో దాదాపు 35వేల ఎకరాలతోపాటు బీటీపీకి కృష్ణా జలాల తరలింపుతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది’’అని శ్రీనివాసులు తెలిపారు.