
Gold price drop: ఉద్రిక్తతలు తగ్గుముఖం.. భారీగా దిగొచ్చిన పసిడి ధర
Play all audios:

Gold price drop | దిల్లీ: భౌగోళిక ఉద్రిక్తలతో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరకు కళ్లెం పడింది. అమెరికా- చైనా మధ్య టారిఫ్లకు 90 రోజుల పాటు బ్రేక్ పడిన నేపథ్యంలో పసిడి ధర భారీగా
తగ్గింది. మొన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో 3400 డాలర్ల ఎగువన ట్రేడయిన ఔన్సు బంగారం ధర.. 3218 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ ధరకు అనుగుణంగా దేశ రాజధాని దిల్లీలోనూ 10 గ్రాముల పసిడి ధర
రూ.96,550కు చేరింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో హైదరాబాద్లో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 96,125 వద్ద ట్రేడవుతోంది. శనివారం రూ.99,950 వద్ద ట్రేడయిన పసిడి రూ.3,400 మేర తగ్గింది.
వెండి సైతం కిలో రూ.200 మేర తగ్గి రూ.99,700 వద్ద ట్రేడవుతోంది. పోటాపోటీగా టారిఫ్లు విధించుకున్న అమెరికా-చైనా సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికా తన సుంకాలను 145
శాతం నుంచి 30 శాతానికి తగ్గించేందుకు అంగీకరించగా.. చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 10 శాతం మాత్రమే సుంకం విధించేందుకు ఓకే చెప్పింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల్లో పురోగతి,
భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం వంటి ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు బంగారంలో భారీగా పెట్టుబడులు చేసిన వారు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగారు. దీంతో బంగారం ధర దిగొచ్చిందని అనలిస్టులు
పేర్కొంటున్నారు. దీనికితోడు డాలర్ ఇండెక్స్ కూడా పుంజుకొని మళ్లీ 101.76కు చేరడం కూడా మరో కారణమని చెబుతున్నారు.