
Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ
Play all audios:

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్ స్టాక్స్ అండతో సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ లాభపడ్డాయి. ఈయూతో వాణిజ్య చర్చల
గడువును జులై 9 వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో 50 శాతం టారిఫ్ల అమలు వాయిదా పడింది. తాత్కాలికంగా అనిశ్చితులు చల్లారడంతో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ
రాణించాయి. నిఫ్టీ 25 వేల మార్కు ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 81,928.95 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,721.08) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరును కొనసాగించింది. ఇంట్రాడేలో
82,492.24 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 455.37 పాయింట్ల లాభంతో 82,176.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,001 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం
విలువ 35 పైసలు బలపడి 85.10గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎటర్నల్,
అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, సన్ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 64.75 డాలర్లు వద్ద కొనసాగుతుండగా.. బంగారం
ఔన్సు 3,332 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.