
Bjp: ఆపరేషన్ సిందూర్ 100% సక్సెస్.. మోదీ వ్యూహాలు శత్రుదేశం ఊహకు కూడా అందవు: భాజపా
Play all audios:

దిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట పాకిస్థాన్కు భారత్ గట్టి జవాబిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో
సరిహద్దుల్లో వాతావరణం కాస్త ప్రశాంతంగా మారింది. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వ పటిమను భాజపా (BJP) కొనియాడింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంబిత్ పాత్ర (Sambit
Patra) దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వంద శాతం విజయవంతమైందని సంబిత్ పాత్రా పేర్కొన్నారు. ‘‘మన సైన్యం వంద శాతం విజయం సాధించింది. అది కూడా నియంత్రిత,
కచ్చితమైన చర్యల ద్వారా. పాకిస్థాన్లోని కీలక ప్రాంతాలను సైన్యం టార్గెట్గా చేసుకుంది’’ అని ఆయన వివరించారు. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు
హామీ ఇచ్చారని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. నరేంద్ర మోదీ వ్యూహాలు శత్రుదేశం ఊహలకు కూడా అందవని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సైన్యం తమ సత్తా చాటిందని పేర్కొన్నారు. ఇది అద్భుత
విజయమని.. పాకిస్థాన్ భూభాగంలోని సుదూర ప్రాంతాలకు దూసుకెళ్లి.. శత్రు దేశ ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించారని.. ఇది నయా భారత్ అని పేర్కొన్నారు. ఒక అణ్వాయుధ దేశం లోతుల్లోకి వెళ్లి దాడి చేయడం ఇదే
మొదటిసారని వెల్లడించారు. * అవును.. మా యుద్ధవిమానం ధ్వంసమైంది: అంగీకరించిన పాకిస్థాన్ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఐదు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని సంబిత్ పాత్ర
పేర్కొన్నారు. మొదటిది శత్రు భూభాగంలోని సుదూర ప్రాంతాలకు వెళ్లి దాడి చేయడం.. రెండోది ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం.. మూడోది వాటిని పూర్తిగా నిర్మూలించడం.. నాల్గోది ఈ ప్రక్రియలో పౌరులెవరూ
గాయపడకుండా చూసుకోవడం.. ఐదోది సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయకుండా ఉండటమని వివరించారు. ఈసందర్భంగా భారత సైన్యం అజేయమైన శక్తిపాటవాలను ప్రదర్శించిందని.. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిందని
కొనియాడారు.