
Jonas masetti: మెకానికల్ ఇంజినీర్ టు ఆధ్యాత్మిక గురువు.. ఎవరీ జొనాస్ మాసెట్టి?
Play all audios:

Jonas Masetti | ఇంటర్నెట్ డెస్క్: ధోతీ.. మెడలో రుద్రాక్ష మాల.. కాలికి చెప్పుల్లేకుండా నడి వయసు ఉన్న ఓ వ్యక్తి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తాజాగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఆయన పేరు ఆచార్య విశ్వనాథ్. ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా? ఆయన అసలు పేరు జొనాస్ మాసెట్టి. బ్రెజిల్కు చెందిన వ్యక్తి. వేదాలు, భగవద్గీత, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం
చేస్తున్నందుకు గానూ ఈ పౌర పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. భారతీయ సంస్కృతి పట్ల ఆయనకున్న గౌరవాన్ని పలువురు
ప్రశంసిస్తున్నారు. దీంతో ఎవరీయన అంటూ ఆరా తీస్తున్నారు. జొనాస్ మాసెట్టి బ్రెజిల్కు చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు. వేద పండితుడు. జొనాస్ మాసెట్టి బ్రెజిల్లోని రియో డి జనీరోలో జన్మించారు. ఆయన
మొదట మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేశారు. పాశ్చాత్య జీవన విధానం, డబ్బు, స్నేహతులు ఇవేవీ ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు. దీంతో జీవితానికి అర్థం తెలుసుకోవడానికి
తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకున్నారు. అక్కడున్న గురువు స్వామి దయానంద సరస్వతి వద్దకు చేరుకుని ఆయన మార్గదర్శనంలో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టారు. భారత దేశ వేద జ్ఞానం, భగవద్గీత బోధనలు
ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. అలా జొనాస్ మాసెట్టి కాస్త ఆచార్య విశ్వనాథ్గా మారారు. బ్రెజిల్ కేంద్రంగా ఆధ్యాత్మిక పాఠాలు భారత్ నుంచి తిరిగి బ్రెజిల్ పయనం అయిన ఆచార్య విశ్వనాథ్..
రియో డి జనీరోలో విశ్వ విద్య గురుకులాన్ని స్థాపించారు. కోయంబత్తూరులో తాను నేర్చుకున్న వేద జ్ఞానాన్ని ఉచిత ఆన్లైన్ కోర్సులుగా అందించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏడేళ్లలో 1.5 లక్షల
మంది విద్యార్థులకు ఆధ్యాత్మిక పాఠాలు బోధించారు. భారతీయ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆచార్య విశ్వనాథ్ను ప్రధాని మోదీ 2024లో నిర్వహించిన మన్కీ బాత్లో ప్రస్తావించారు. సాంస్కృతిక
వారధి అంటూ కొనియాడారు. గతంలో బ్రెజిల్ పర్యటనకు వెళ్లినప్పుడూ ఆయన్ను వ్యక్తిగతంగా కలిశారు. యోగా, వేదాలపై జొనాస్ పలు పుస్తకాలు కూడా రచించారు. ఈ క్రమంలోనే ఆయనను పద్మశ్రీ పురస్కారంతో భారత
ప్రభుత్వం సత్కరించింది. ఈ పురస్కరాన్ని తాను ఊహించలేదని, ఈ అవార్డును గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆచార్య విశ్వనాథ్ పేర్కొన్నారు.