
Ramadoss: కుమారుడిని కేంద్రమంత్రిని చేసి తప్పుచేశా - రామదాస్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో కీలక నేత, పీఎంకే (పాట్టాలి మక్కల్ కట్చి) వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామదాస్ (Dr S Ramadoss) కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు అన్బుమణి రామదాస్ను గతంలో
కేంద్రమంత్రిని చేసి తప్పుచేశానని వ్యాఖ్యానించారు. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా నాటి నిర్ణయం జరిగిందన్నారు. ఇటీవల పార్టీ అధ్యక్ష పదవి నుంచి కుమారుడిని తప్పిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. తాజాగా ఈ
వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్టీలో తాజా పరిణామాలపై తైలాపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన డాక్టర్ రామదాస్.. క్రమశిక్షణ, పార్టీ నియమాలు, సీనియర్ల పట్ల అంతగా గౌరవం లేని వ్యక్తి
గురించి మాట్లాడలేనన్నారు. ధర్మపురి సభలో కుమారుడి ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. పార్టీ కార్యకర్తల దృష్టి మరల్చి, సానుభూతి పొందేందుకే ఆయన అలా మాట్లాడాడని అన్నారు. అది ఆయన తప్పు కాదని,
సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లి కుమారుడిని గతంలో కేంద్ర మంత్రిని చేయడమే తన తప్పని వ్యాఖ్యానించారు. * ఆ కొవిడ్ పేషంట్ను చంపేయ్..! ఓ డాక్టర్ ఆడియో క్లిప్ వైరల్ ‘‘అన్బుమణికి 35ఏళ్ల వయసులో
కేంద్ర మంత్రిని చేసి తప్పుచేశా. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో భాజపాతో పొత్తు పెట్టుకున్నాడు’’ అని వ్యాఖ్యానించారు. అవసరమైతే పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అన్బుమణిని పార్టీ పదవి
నుంచి తొలగిస్తానని అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన.. 2004-2009 వరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. పీఎంకే అధ్యక్షుడిగా
కొనసాగుతున్న అన్బుమణి రామదాస్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా సీనియర్ రామదాస్ ఇటీవల ప్రకటించారు. పార్టీపై పూర్తి నియంత్రణ ఇక తన చేతుల్లోనే ఉండనుందన్నారు. ఏప్రిల్ 10న కేంద్రమంత్రి అమిత్ షా
చెన్నై పర్యటన సందర్భంలో ఈ అనూహ్య ప్రకటన వెలువడింది. దీంతో అన్బుమణి వర్గం కూడా ఒక్కసారిగా తీవ్ర అసంతృప్తికి లోనయ్యింది. ఇటీవల ధర్మపురిలో జరిగిన సమావేశంలో అన్బుమణి మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి
నుంచి తనను ఎందుకు తప్పించారో చెప్పాలని ప్రశ్నించారు. తన మేనల్లుడు ముకుందన్ను పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించడాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో తిరిగి పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని
ఆయన మద్దతుదారులు కూడా పలుచోట్ల నిరసనలు చేపట్టారు.