
Operation sindoor: భారత్ దాడి చేసింది.. లష్కరే పుట్టపైనే
Play all audios:

Operation Sindoor | ఇంటర్నెట్డెస్క్: అమాయక ప్రజలు, ప్రార్థనామందిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించిందంటూ.. పాక్ ఎన్ని కబుర్లు చెప్పినా మురీద్కేలోని ఉగ్రపాములను దాచలేకపోతోంది. అక్కడి
మర్కజ్ తయ్యబా భవనం వివిధ రకాల ఉగ్రమూకలను సాకే కేంద్రంగా నిలిచిందని పశ్చిమ దేశాల మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. తాజాగా స్కైన్యూస్ బృందం వివిధ సోషల్ మీడియా వేదికల నుంచి సేకరించిన
వీడియోలు, ఫొటోలు, కామెంట్లను విశ్లేషించి.. మురీద్కేలో భారత్ దాడి చేసింది లష్కరే ఉగ్రపుట్టపైనే అని తేల్చింది. దీనికి తోడు ఈ దాడి తర్వాత అల్ఖైదా ఉపఖండం శాఖ భారత్ను తప్పుపట్టడాన్ని కూడా
చూపించింది. మురీద్కేలోని మర్కజ్ తయ్యబాకు సంబంధించి టిక్టాక్, యూట్యూబ్, గూగుల్లలో పోస్టు చేసిన వీడియోలను స్కైన్యూస్ సేకరించింది. వాటిల్లో లష్కరే తయ్యబాకు మద్దతుగా చాలా క్లిప్స్
ఉన్నాయి. అత్యధికంగా ‘313’ అనే గ్రూపు పోస్టు చేసిన వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వీడియోల జియోలోకేషన్లు చూడగా వాటిల్లో చాలా వరకు లష్కరే, 313 అనే క్యాప్షన్లు వచ్చాయి. వీధుల్లో తుపాకులతో
తిరుగుతున్న వ్యక్తులను ఓ వీడియోలో చూపించారు. దీనికి లష్కరే తయ్యబా, ముజాహిద్ ఫోర్స్, 313, మర్కజ్ తయ్యబా మురీద్కే అనే క్యాప్షన్లు ఉన్నాయి. మరో దానిలో పిల్లలు ఆయుధాలు వాడుతున్నట్లు చూపారు.
అక్కడ కూడా ‘313 జిహాద్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. వీటిలో చాలా ఖాతాలకు పరస్పర సంబంధాలున్నాయి. ఇక టెర్రరిజం రీసెర్చి అండ్ అనాలిసస్ కన్సార్టియంకు చెందిన ముస్కాన్ సంగ్వాన్ స్పందిస్తూ..
‘బ్రిగేడ్ 313 అనేది పాక్లోని అల్ ఖైదా విభాగం. దీని ఛత్రం కింద తాలిబన్, లష్కరే జంగ్వీ, హర్కత్ ఉల్జిహాద్ అల్ ఇస్లామీ, జైషే మొహమ్మద్, లష్కరే తయ్యబా, జుందుల్లా సంస్థలు ఉంటాయి. బ్యాటిల్
ఆఫ్ బద్ర్కు గుర్తుగా 313 పేరు పెట్టుకున్నారు. వీరిలో అత్యధిక మంది టిక్టాక్నే వినియోగిస్తారు’ అని చెప్పారు. ఇక స్కైన్యూస్ భారత్ దాడికి ముందు, తర్వాత ఇక్కడ లొకేషన్లను విశ్లేషించగా..
యూజర్ పేరులో 313 అని ఉన్న ఒకరు భారత్ దాడి తర్వాత దెబ్బతిన్న భవనాల వీడియోను పోస్టు చేశారు. మురీద్కేలోని ఈ ఉగ్రవాదులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. రిక్రూట్మెంట్కు మరింత మందిని
ఆకర్షిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ను స్కైన్యూస్ ప్రశ్నించగా.. ఈ టిక్టాక్ వీడియోలను నమ్మకమైన ఆధారాలుగా పరిగణిస్తానంటే లక్షలు
చూపిస్తానంటూ మాట్లాడారు.