
India- pakistan: పాక్ను నమ్మలేం.. ఇళ్లకు వెళ్లలేం.. : సరిహద్దు గ్రామాల ప్రజలు
Play all audios:

(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్డెస్క్: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో జమ్మూకశ్మీర్లోని సరిహద్దు గ్రామాల ప్రజలు (Kashmir border villages) సురక్షిత
ప్రాంతాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలంటే జంకుతున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. పాక్ను నమ్మలేమని అంటున్నారు. ఏ
క్షణమైనా ఫైరింగ్ జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈమేరకు పలువురు స్థానికులు జాతీయ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)తో మన బలగాలు
దీటుగా బదులిచ్చాయి. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్.. జమ్మూకశ్మీర్లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడింది. దాంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు కాల్పుల విరమణ
ఒప్పందం జరగడంతో పూంఛ్ నివాసి అయిన సంజీవ్ శర్మ తన కుటుంబంతో కలిసి తిరిగి ఇంటికి వచ్చారు. కానీ పాక్ వైపు నుంచి వచ్చిన షెల్లింగ్, డ్రోన్ల కారణంగా ఆయన ఇంటి మొదటి అంతస్తు దెబ్బతిన్నది.
‘‘షెల్లింగ్ దాడులు తీవ్రం కావడంతో ఆరోజు అందినకాడికి ముఖ్యమైనవి తీసుకొని హడావుడిగా తీసుకెళ్లిపోయాం. మొత్తం 12 మంది సభ్యులం కారులో వెళ్లాం. మా ఇంటి మొదటి అంతస్తు ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ
మేం అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఆ ఘటన చోటుచేసుకుంది’’ అని వెల్లడించారు. * కశ్మీర్ ముమ్మాటికీ ద్వైపాక్షిక అంశమే పాక్ చర్యలకు పూంఛ్ ప్రాంత ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. అక్కడ 25 మంది
ప్రాణాలు కోల్పోయారు. పాక్ నుంచి ఆ స్థాయి షెల్లింగ్ను తాను గతంలో ఎన్నడూ చూడలేదని ధరమ్పాల్ సింగ్ జస్రోతియా వెల్లడించారు. ‘‘మా ఇంటిని షెల్ తాకినప్పుడు.. మేం కింద ఉన్న బంకర్లో ఉన్నాం. 25
ఏళ్ల క్రితం మేం బంకర్ను ఉపయోగించాం. మళ్లీ ఇప్పుడు వాడాల్సి వచ్చింది’’ అని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ.. తాము పాక్ను నమ్మలేకపోతున్నామని పలువురు వెల్లడించారు.
ఇప్పటికీ వారిలో భయం ఉన్నప్పటికీ.. కాల్పుల విరమణతో ఊపిరి పీల్చుకున్నారు. తాము శాంతియుత వాతావరణంలో జీవించాలనుకుంటున్నామని, యుద్ధమంటే విధ్వంసం మాత్రమేనని అన్నారు.