Usha vance: ప్రధాని మోదీని కలవడం ఎంతో ప్రత్యేకం: భారత పర్యటనపై ఉషా వాన్స్‌

Usha vance: ప్రధాని మోదీని కలవడం ఎంతో ప్రత్యేకం: భారత పర్యటనపై ఉషా వాన్స్‌

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (JD Vance) కుటుంబసమేతంగా ఇటీవల భారత్‌ (India)లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన తనకు ఎంతో ప్రత్యేకమైనదని జేడీ వాన్స్‌ సతీమణి ఉషా


వాన్స్‌ (Usha Vance) పేర్కొన్నారు. వాషింగ్టన్‌ డీసీలో యూఎస్‌- ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరంలో ఉషా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్‌ పర్యటనలో తన పిల్లల అనుభవాలను కూడా


ఆమె పంచుకున్నారు.  ‘ఇది మాకు జీవితకాలం గుర్తుండిపోయే ప్రయాణం. నా పిల్లలు భారత్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకునేవారు తప్ప ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదు.  ఇప్పుడు వారు స్వయంగా అక్కడ పర్యటించి,


అనేక విషయాలను తెలుసుకోగలిగారు. నాకు, జేడీకి కూడా ఇది ఎంతో ప్రత్యేకమైనది. అక్కడ ఉన్న కొన్ని గొప్ప ప్రదేశాలను చూసే అవకాశం మాకు లభించింది. సూర్యుడు ఉదయించేటప్పుడు తాజ్‌మహల్‌ను చూడటం నాకు ఎంతో


ఆనందంగా అనిపించింది. అక్కడ ఒక తోలుబొమ్మలాట జరిగింది. అది ఎంతో ప్రత్యేకమైనది. రామాయణంలోని కొన్ని విషయాలను కూడా అందులో ప్రదర్శించారు. అక్కడ మేము కొన్ని ఆలయాలను కూడా సందర్శించాం. ఆ


దేవాలయాల్లోని శిల్పకళ నా పెద్ద కుమారుడిని ఆశ్చర్యపరిచింది. అవి గొప్ప కళాఖండాలు అని అతడు అభివర్ణించాడు. మరో కుమారుడు వివేక్‌కు అక్కడి ఏనుగులు, ఒంటెలు, నెమళ్లు ఎంతో నచ్చాయి. వాటిని అలా చూస్తూ


ఉండిపోవడాన్ని అతడు ఇష్టపడ్డాడు. నా కుమార్తె అక్కడి ఆటో, రిక్షాల్లో ప్రయాణించడాన్ని ఇష్టపడింది’ అని ఉషా పేర్కొన్నారు.  * అమెరికాలో యూదులపై సీసా బాంబులతో దాడి మోదీని తాతగా భావిస్తున్నారు..


ఈసందర్భంగా ప్రధాని మోదీ  (PM Modi)ని కలవడం గురించి కూడా మాట్లాడారు. అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు మోదీని కలిసినప్పటి విషయాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే తొలిసారి తన పిల్లలు మోదీని


కలిశారన్నారు. అప్పుడే వారు ఆయన్ను తాతగా భావించారన్నారు. భారత పర్యటనలో ఆయన నివాసానికి వెళ్లగానే.. తన పిల్లలు మోదీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారని పేర్కొన్నారు. వారికి ఆయనంటే ఎంతో


ఇష్టమన్నారు. మోదీ నివాసంలో ఉన్నప్పుడు అక్కడి కార్ట్‌లోని మామిడి పండ్లన్నింటినీ తన కుమారుడు తీసుకున్నాడని తెలిపారు. తనకు అక్కడే ఉండిపోవాలని ఉందని అతడు పేర్కొన్నట్లు వెల్లడించారు. భారత్‌


పర్యటన గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారన్నారు. ఈసందర్భంగా తాను మరోసారి భారత్‌లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నానని ఉషా పేర్కొన్నారు. ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లోనూ తాను


పర్యటిస్తానన్నారు.