
Russia: కస్క్ రీజియన్లో పుతిన్ పర్యటన..
Play all audios:

Russia ఇంటర్నెట్డెస్క్: కస్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ బలగాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకొన్నాక తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించారు. అక్కడి కుర్చాటోవ్ నగరంలోని మున్సిపల్
అధికారులతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం కస్క్లోని అణుకేంద్రాన్ని ఆయన సందర్శించినట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా పోస్టు చేసింది. మరోవైపు ఇక్కడ
సరిహద్దులు దాటి వచ్చేందుకు ఉక్రెయిన్ దళాలు ఇంకా ప్రయత్నిస్తున్నట్లు మరో రష్యా న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నొవొస్టి వెల్లడించింది. కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు పాతిన మందుపాతరలను
తొలగించేందుకు అదనపు దళాలను మోహరించాలని పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు నిర్మాణంలో ఉన్న కస్క్ న్యూక్లియర్ ప్లాంట్-2ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ వాలెంటీర్లతో ఆయన సమావేశం అయ్యారు.
ఉక్రెయిన్ ఆక్రమణ తర్వాత ఇళ్లు వదలి వెళ్లిపోయిన వారికి నెలవారీ చెల్లింపులు చేసే అంశాన్ని అక్కడి గవర్నర్ అలెగ్జాండర్ ఖినెస్టైన్తో చర్చించారు. గతేడాది ఆగస్టులో ఉక్రెయిన్ బలగాలు హఠాత్తుగా
ఈ ప్రదేశాన్ని ఆక్రమించిన విషయం తెలిసిందే. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించుకోవడం అదే తొలిసారి. నాటినుంచి ఉత్తర కొరియా దళాల సహాయం తీసుకోవాలని రష్యా నిర్ణయించింది.
మరోవైపు కీవ్ దీనిపై పట్టు సాధించి చర్చల్లో బేరసారాలకు వాడుకోవాలని భావించింది. కానీ, రష్యా-ఉత్తరకొరియా బలగాల దెబ్బకు ఉక్రెయిన్ సేనలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు
సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. మాస్క్తో కాల్పుల విరమణ చర్చలను తాము త్వరలో ప్రారంభించనున్నామని ట్రంప్ ఆ తర్వాత తెలిపారు.
ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ తెలిపినట్లు పేర్కొన్నారు. శాంతియుత ఒప్పందానికి తాము అనుకూలమని, రాజీ అంశాలు.. ఉభయ కుశలోపరిగా ఉండాలని పేర్కొన్నారు. కాల్పుల
విరమణ ఒప్పందం కుదరకపోవడంతో అసహనంగా ఉన్న ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. తొలుత పుతిన్తో ఆయన రెండు గంటలకు పైగా ఫోన్లో చర్చించారు. ఈనేపథ్యంలో తాము తిరిగి స్వాధీనం చేసుకొన్న కస్క్లో పుతిన్
పర్యటించడం గమనార్హం.