
South west monsoon: నాలుగైదు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈనెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకొచ్చని
భావించగా.. అందుకు పది రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్లో విస్తరించాయి. మే 27 నాటికి కేరళ మీదుగా రుతుపవనాలు ప్రారంభమవుతాయని అంచనా వేసినప్పటికీ.. మరో
నాలుగైదు రోజుల్లో అత్యంత త్వరగా కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. ఏటా జూన్ 1 ప్రాంతంలో కేరళను తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ముందుగానే వస్తున్నాయని వెల్లడించింది.
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడం ద్వారా దేశమంతటా వర్షాలు మొదలవుతాయి. జులై 8 నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబరు 17తో రుతుపవనాల
ఉపసంహరణ మొదలై అక్టోబరు 15 నాటికి ముగుస్తుంది. గతేడాది మే 30న నైరుతి రుతుపవనాలు రాగా.. 2023 జూన్ 8న, 2022 మే 29న దేశంలోకి ప్రవేశించాయి. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే
అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో సాగు భూమి నుంచే ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత
ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, దేశ జీడీపీకి 18.2 శాతం తోడ్పాటుకు
ఇది ఎంతో ముఖ్యం.