Maoists: మావోయిస్టు కొత్త దళపతి ఎవరు?

Maoists: మావోయిస్టు కొత్త దళపతి ఎవరు?

Play all audios:


Maoists | ఇంటర్నెట్‌డెస్క్‌: మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణంతో ఇప్పుడా స్థానంలోకి ఎవరు రానున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టిపెట్టాయి. ప్రస్తుత దళం


చుక్కానీ వంటి నాయకుడిని కోల్పోవడంతో.. ఆ స్థానం తీసుకోవడం కొత్తవారికి సవాళ్లతో కూడుకొన్న పనే. ఈ క్రమంలో రెండు పేర్లపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టిపెట్టాయి. వీటిలో తిప్పిరి తిరుపతి అలియాస్‌


దేవుజీ, మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్‌ సోను పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం తిరుపతి మావోయిస్టు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఉన్నారు. ఇది పార్టీ సాయుధ విభాగం. ఇక వేణుగోపాలరావు


పార్టీ సైద్ధాంతిక విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. వీరిలో తిరుపతి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. వేణుగోపాలరావు అగ్రకులానికి చెందినవారు. ఈ నేపథ్యంలో తిరుపతి పగ్గాలు


చేపడితే.. దళితులతోపాటు.. ఆదివాసీల్లో పార్టీని బలంగా తీసుకెళ్లేందుకు వారికి అవకాశం లభిస్తుందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. పార్టీకి గతంలో నాయకత్వం వహించిన మల్లోజుల కోటేశ్వరరావు,


నంబాల కేశవరావుతో పోలిస్తే.. వీరిద్దరూ రెండో శ్రేణి నాయకులు. పాత తరం నాయకుల్లో చాలా మంది ఇప్పటికే చనిపోయారు. ప్రస్తుతం తిరుపతికి 62 ఏళ్లు కాగా.. వేణుగోపాలరావుకు 70 సంవత్సరాల వయస్సు.  


వీరిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. తిరుపతిది జగిత్యాల కాగా.. వేణుది పెద్దపల్లి. ఇకఈ నేపథ్యంలో మావోయిస్టులు సాయుధ విభాగం నాయకుడి వైపు మొగ్గుతారా.. లేదా సైద్ధాంతిక విభాగం నాయకత్వాన్ని


ఆమోదిస్తారా అన్నది కీలకమని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి.  వీరిలో వేణుగోపాల్‌కు పార్టీలో సీనియర్ల మద్దతు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆయన పూర్వపు నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు


సోదరుడు. ఇప్పటికీ పార్టీలో ఆయన్ను అతిపెద్ద నాయకుడిగా భావిస్తుంటారు. ఆ స్థానాన్ని వేణుగోపాల్‌ మాత్రమే భర్తీ చేయగలడని అంచనాలున్నాయి. ఇప్పటికే పార్టీలో ఉన్న పాతతరం నాయకులు ప్రభుత్వంతో చర్చల


కోసం  ఆయుధాలు వదిలి లొంగిపోవడానికి సిద్ధంగా లేరని అధికారులు చెబుతున్నారు.  అబూజ్‌మడ్‌ అడువుల్లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళపతి నంబాల కేశవరావ్‌ అలియాస్‌ బస్వరాజ్‌ (70)


మరణించారు. ఆయనతో పాటు మావోయిస్టు పత్రిక ‘అవామ్‌-ఇ-జంగ్‌’ ఎడిటోరియల్‌ బోర్డు సభ్యుడు సజ్జ వెంకటనాగేశ్వరరావు ఎలియాస్‌ నవీన్‌ (61), మావోయిస్టు కంపెనీ కాయ్‌7 కమాండర్‌ టిప్పు కూడా ఉన్నారు.