
China: ట్రంప్ ఆరోపణలు నిరాధారం: చైనా
Play all audios:

China| ఇంటర్నెట్డెస్క్: జెనీవా వాణిజ్య చర్చల్లో అవగాహనకు వచ్చిన ఏకాభిప్రాయాన్ని బీజింగ్ ఉల్లంఘించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చైనా తోసిపుచ్చింది. అవి
పూర్తిగా నిరాధార ఆరోపణలు అని అభివర్ణించింది. అంతేకాదు.. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు శక్తిమంతమైన చర్యలు తీసుకొంటామని తేల్చిచెప్పింది. ఈమేరకు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా వాణిజ్య శాఖ
స్పందించింది. జెనీవాలో జరిగిన ఒప్పందాన్ని తాము పూర్తిస్థాయిలో అమలుచేసినట్లు చైనా పేర్కొంది. ఈక్రమంలో అమెరికా మాత్రం బీజింగ్పై వివక్షపూరిత చర్యలు తీసుకొన్నట్లు ఆరోపించింది. వీటిల్లో కృత్రిమ
మేధకు సంబంధించిన చిప్స్పై నియంత్రణ, చిప్ డిజైన్ సాఫ్ట్వేర్లు తమకు విక్రయించకుండా అడ్డంకులు, తమ దేశ విద్యార్థుల వీసాల రద్దు వంటివి ఉన్నాయని వెల్లడించింది. ‘‘అమెరికా ఉద్దేశపూర్వకంగానే
ద్వైపాక్షిక వాణిజ్యంలో మళ్లీ మళ్లీ ఆర్థిక, వాణిజ్య ఘర్షణల, అస్థిరతను రేపుతోంది’’ అని చైనా వాణిజ్యశాఖ మండిపడింది. దీనికి ప్రతిగా ఏం చర్యలు తీసుకొంటుందో మాత్రం వెల్లడించలేదు. మే మధ్య వారంలో
బీజింగ్-వాషింగ్టన్ల మధ్య జెనీవా వేదికగా ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 90 రోజులపాటు మూడంకెల టారిఫ్ల అమలును నిలిపివేయాల్సి ఉంది. దీనికి ప్రతిగా చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలు,
సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ పరిశ్రమకు అవసరమైన ముడిసరకును నిరాటంకంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ చైనా ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ వ్యాఖ్యానించిన విషయం
తెలిసిందే. అదేరోజు ఆయన స్టీల్, అల్యూమినియం దిగుమతిపై టారిఫ్ను రెట్టింపు చేసి 50శాతానికి చేర్చారు. ప్రపంచంలో అత్యధికంగా స్టీల్ ఎగుమతి చేసే దేశం చైనానే.