
Samantha: అప్పుడు నేనెంతో బాధపడ్డా.. ఫెయిల్యూర్ని అనుకున్నా: సమంత
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: ‘శుభం’ (Subham)తో నిర్మాతగా తొలి అడుగు వేశారు నటి సమంత (Samantha). ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర
విషయాలు బయటపెట్టారు. త్వరలోనే తాను ‘మా ఇంటి బంగారం’ (maa inti bangaram) సెట్లోకి అడుగుపెడతానని చెప్పారు. యాక్టింగ్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకొని.. తిరిగి సెట్లోకి అడుగుపెట్టినప్పుడు
ఎంతో కంగారుపడ్డానన్నారు. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ‘ఊ అంటావా’ పాట ఆఫర్ వచ్చిందని దానిని తానొక సవాలుగా స్వీకరించానని తెలిపారు. తన తండ్రి మరణించిన రోజును గుర్తుచేసుకున్నారు.
అప్పుడెంతో బాధపడ్డా..! ‘‘కెరీర్ ఆరంభంలోనే సక్సెస్ చూశా. వరుస సినిమాలు విజయాలు అందుకున్నాయి. దాంతో అందరూ నన్ను గోల్డెన్ లెగ్ ఆఫ్ తెలుగు సినిమా అని పిలిచేవారు. పోటీలో భాగమైపోయా. కానీ
ఫెయిల్యూర్స్ వల్లే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా సినిమా తొలిసారి ఫ్లాప్ అయినప్పుడు కుమిలిపోయా. నేనొక ఫెయిల్యూర్ని అనుకున్నా. ఇన్నేళ్ల కెరీర్ తర్వాత సక్సెస్ అంటే నా దృష్టిలో నిర్వచనం
మారింది. స్వేచ్ఛగా జీవించడమే విజయం అని అర్ధమైంది. ఇప్పుడు నేను సక్సెస్లో లేనని చాలామంది అనుకుంటారు. కానీ, గతంతో పోలిస్తే ఇప్పుడే నేను విజయవంతంగా రాణిస్తున్నా. ప్రతిరోజూ నాకిష్టమైన పనులతో
కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకుసాగుతున్నా’’ భయపడ్డా..! ‘‘ఆరోగ్యపరమైన సమస్యల రీత్యా కొంతకాలం వర్క్ నుంచి బ్రేక్ తీసుకున్నా. యాక్టింగ్ను ఎంతో మిస్ అయ్యా. యాక్టింగ్ మర్చిపోయానేమో
అనిపించింది. ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ షూట్లోకి అడుగుపెట్టిన తొలిరోజు అంత సులువుగా అనిపించలేదు. ఒకసారి యాక్టింగ్లోకి దిగితే జీవితాంతం అది మనలో భాగం అవుతుందని అప్పుడు
అర్థమైంది’’ ‘ఊ అంటావా’.. సవాలు..! ‘‘ఊ అంటావా’ ఆఫర్ వచ్చినప్పుడు చాలామంది చేయొద్దని చెప్పారు. నన్ను నేను ఎప్పుడూ ఒక హాట్ గర్ల్గా అనుకోలేదు. ఆవిధంగా అస్సలు ఊహించుకోలేదు. అలాంటి సమయంలో ఈ పాట
ఆఫర్ వచ్చినప్పుడు ఒక సవాలుగా అనుకొని చేశా. సెట్లోకి అడుగు పెట్టినప్పుడు కూడా కంగారుపడ్డా. అయినా ధైర్యంగా సాంగ్ పూర్తి చేశా. మళ్లీ భవిష్యత్తులో అలాంటి పాటల్లో యాక్ట్ చేస్తాననుకోవడం లేదు’’
ఫొటోలు ఇచ్చా..! ‘‘అభిమానుల వల్లే ఈ స్థాయికి వచ్చాను. అందుకే వాళ్లు ఎప్పుడైనా ఫొటోలు కోసం అడిగితే నో చెప్పను. మా నాన్న చనిపోయిన రోజు ముంబయిలో ఉన్నా. అమ్మ ఫోన్ చేసి విషయం చెప్పగానే షాకయ్యా.
ఆయనతో కొంతకాలంగా మాట్లాడటం లేదు. ఆరోజు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఫ్లైట్ జర్నీలో ఉన్నప్పుడు.. ఇంటికి వెళ్లే సమయంలో చాలామంది అభిమానులు నన్ను కలిసి ఫొటోల కోసం రిక్వెస్ట్ చేశారు. నేను
వారితో నవ్వుతూనే ఫొటోలు దిగా. వాళ్లను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు’’ అని సమంత వివరించారు.