Tej pratap yadav: నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? : తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ భార్య తీవ్ర ఆగ్రహం

Tej pratap yadav: నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? : తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ భార్య తీవ్ర ఆగ్రహం

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నికల వేళ.. ఆర్జేడీ అధినేత, బిహార్‌ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap Yadav) మరోసారి వార్తల్లో


నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన రిలేషన్‌షిప్ పోస్టు నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై కొన్నేళ్లుగా ఆయనకు దూరంగా ఉంటున్న సతీమణి ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) స్పందించారు. ‘‘ఈ రిలేషన్‌షిప్‌


గురించి వారికి ముందే తెలిసినప్పుడు.. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు..? ఈ వ్యవహారంలో అందరి పాత్ర ఉంది. మీడియా ద్వారానే ప్రతి విషయం నా దృష్టికి వచ్చింది. నన్ను కొట్టి, వేధించినప్పుడు వారి


సామాజిక న్యాయం ఎక్కడికి పోయింది..? వారికి ఇప్పుడు సామాజిక న్యాయం గుర్తొచ్చింది. వాళ్లంతా కలిసే ఉన్నారు. బిహార్‌ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ఈ బహిష్కరణ నాటకాన్ని రబ్రీదేవి (తేజ్‌ప్రతాప్ తల్లి)


రచించిఉంటారు. నా విడాకుల గురించి మీడియా ద్వారానే తెలిసింది. ఏం జరిగిందో వాళ్లనే అడగండి. నా జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? నా భవిష్యత్తు గురించి వాళ్లనే అడగండి.’’ అని ఐశ్వర్య తీవ్ర


ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలేం జరిగిందంటే.. శనివారం తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో దానిలో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్‌ అని, గత 12 ఏళ్లుగా తాము


రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీనిపైనే ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన సోషల్‌ మీడియా ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపారు. తన కుటుంబ


గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందని వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు. కానీ ఆ రిలేషన్ షిప్ వార్తలు


రాగానే.. లాలూ యాదవ్ కఠిన చర్యలు తీసుకున్నారు. తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమ కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా చేస్తున్న


చర్యలు.. సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయని లాలూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా


లేదని అన్నారు. ఈ కారణాల వల్ల అతడిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై తేజ్‌ ప్రతాప్‌కు ఆర్జేడీ పార్టీలో, తమ కుటుంబంలో స్థానం లేదని స్పష్టం చేశారు. తేజ్‌ ప్రతాప్‌ 2018లో


బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్‌ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, ఈ ఏడాదిలో


బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో ఈ వ్యవహారంపై అందరి దృష్టి పడింది.